YS Vijayamma : 'జైలు మాకు కొత్తేం కాదు.. షర్మిలకు బెయిల్ వచ్చాక తగ్గేదేలే'
YS Vijayamma on YS Sharmila arrest: తన కుమార్తె వైఎస్ షర్మిలకు బెయిల్ వస్తుందని వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. షర్మిల మళ్లీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు. కేసులు, అరెస్టులకు ఆమె భయపడదని స్పష్టం చేశారు. షర్మిల ఒంటరిగానే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందని చెప్పారు. ప్రశ్నించే గొంతుకను తెలంగాణ ప్రభుత్వం నొక్కుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెబుతున్నందుకే అరెస్టు చేశారని విమర్శించారు. అన్ని పార్టీల సభలకు అనుమతిచ్చి షర్మిలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతుందని విజయమ్మ అన్నారు. గ్రూప్ పరీక్షలు, పదోతరగతి పరీక్ష పేపర్ అసలు ఎలా లీక్ అవుతాయని ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నించేలా ప్రభుత్వం నడుచుకోకూడదని వైఎస్ విజయమ్మ హితవు పలికారు.
మరోవైపు షర్మిల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్పై కోర్టులో ఇరువైపులా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్పై తీర్పును కోర్టు వాయిదా వేసింది. దీనిపై నిర్ణయాన్ని సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది.