Srivari Navratri Brahmotsavam in Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అశ్వ వాహనంపై విహరించిన శ్రీవారు
Published : Oct 22, 2023, 10:38 PM IST
Srivari Navratri Brahmotsavam in Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల కొండ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల సందర్బంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అఖరి వాహనమైన అశ్వవాహన సేవ తిరుమలలో ఘనంగా జరిగింది. ఎనిమిది రోజులుగా వివిధ వాహన సేవలపై దర్శనమిచ్చిన శ్రీవారు ఉత్సవాలలో అఖరిగా సుమధురమైన పుష్పమాలికలు, ఆభరణాలు ధరించి కల్కి ఆవతారంతో భక్తులను సాక్షాత్కరించారు. విష్ణు దేవుని ఆవతారాలు పది ప్రసిద్ధమైనవి కాగా వాటిలో చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కిరూపం ధరించి, చర్ణాకోలు చేతబూని అశ్వవాహనధారుదై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతాయి. అధికసంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. తిరువీధుల్లో కళాబృందాల ప్రదర్శనలు యాత్రికులను అలరించాయి రేపు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటలకు జరిగే చక్రస్ధానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి.