BJP Leaders and Farmers Celebrations on announcement Turmeric Board : పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు
Published : Oct 1, 2023, 8:53 PM IST
BJP Leaders and Farmers Celebrations on announcement Turmeric Board : ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించడంతో (Turmeric Board) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. దశాబ్దాలుగా బోర్డు కోసం పోరాటం చేశామంటూ.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. కమలం పార్టీ హయంలో బోర్డు రావడం పట్ల ఆ పార్టీ నాయకులు ఆనందంతో మునిగితేలారు. నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు.. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ కేంద్రాల్లో కమలం నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
PM Modi Announced Turmeric Board in Telangana : ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ శ్రేణులు సంబరాల్లో పాల్గొన్నాయి. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్రెడ్డిని నిజామాబాద్లో శాలువతో సన్మానించారు. గత పన్నెండేళ్లుగా పసుపు బోర్డు సాధించే వరకు చెప్పులు వేసుకోనని ప్రతినబూని.. ఈ రోజు బోర్డు ప్రకటించడంతో ఆయన తిరిగి చెప్పులు ధరించారు.