bridge collapsed: చేపల వేట కోసం నీళ్లొదిలితే.. వంతెన కొట్టుకుపోయింది
temporary bridge collapsed in Tripuraram: నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రం నుంచి దాదాపు 15 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. త్రిపురారం మండలంలో కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో తుంగపాడు బంధంపై ఉన్న పాత వంతెన పునర్నిర్మాణంలో భాగంగా తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు చేశారు. పెద్దదేవులపల్లి చెరువు వద్ద ఎడమ కాల్వలో ఉన్న బ్యాక్ వాటర్ను చేపల వేట కోసం ఒక్కసారిగా వదిలారు. ఆ నీటి ప్రవాహానికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక బ్రిడ్జి కోతకు గురవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడి నుంచి రెడ్డీస్లాబ్, విశాఖ కంపెనీలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు మిర్యాలగూడ నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నవాళ్లు కూడా 25 కిలోమీట్లర దూరం వెళ్లి రావాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన వంతెనను రూ.1.50 కోట్లతో ఇటీవలే పనులు చేపట్టారు. పిల్లర్లు నిర్మాణ దశలోనే ఉండగా సదరు గుత్తేదారుకు ఈ బంధం నీటి ప్రవాహంపై అవగాహన లేకపోవడం వల్ల ఈ కొద్దిపాటి నీటి ప్రవహానికే తాత్కాలిక వంతెన కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు.
TAGGED:
వాహనరాకపోకలకు ఇబ్బంది