తల్లడిల్లిపోయిన గజరాజులు.. బుల్లి ఏనుగు ప్రాణాలతో లేదని తెలియక...
కేరళలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ ఏనుగు పిల్ల నిర్జీవంగా పడి ఉండగా.. మరో గజరాజు దాన్ని లేపడానికి చేసిన ప్రయత్నం హృదయాల్ని ద్రవింపజేసింది. పాలక్కడ్ జిల్లా అనకల్లులో సోమవారం రాత్రి విద్యుత్ తీగ తగిలి ఒక మగ ఏనుగు పిల్ల మృత్యువాత పడింది. అది గుర్తించిన తోటి గజరాజు చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. కాలితో, తొండంతో అటూ ఇటూ తిప్పుతూ లేవమని పిలిచింది. కొన్ని గంటలపాటు అక్కడే ఉన్న తోటి ఏనుగులు ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలకు రానివ్వలేదు. అవన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకు వేచి చూసిన అటవీ అధికారులు.. ఆ తర్వాత చనిపోయిన ఏనుగును తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.