ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయాలను తెరిచి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రావణ శుక్రవారం కావడం వల్ల అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల పూలు, తులసీ దళాలతో పూజలు చేపట్టారు ఆలయ అర్చకులు.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారికి ఉంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయంలోని ముఖమండప ఉయ్యాలలో శయనింపజేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ... లాలి పాటలు పాడారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ... స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు