ETV Bharat / state

Munugode bypoll: మునుగోడు వార్.. నువ్వా నేనా అంటున్న పార్టీలు

author img

By

Published : Oct 29, 2022, 7:41 AM IST

MUNUGODE BATTLE: మునుగోడు ఉపఎన్నిక సంచలనంగా మారనుంది. ఈ యుద్ధంలో అన్ని ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్న విధంగా తలపడుతున్నాయి. డబ్బు, మద్యం ప్రవాహం అయితే ఇంక చెప్పవలసిన అవసరం లేదు. ప్రచారాలతో హోరెత్తిపోతున్న నియోజకవర్గంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో.. వారిని సంతృప్తి పరచడానికి అన్ని పార్టీలు ఏవిధంగా ముందుకు వెళుతున్నాయో.. అసలు మునుగోడు ప్రజలు ఎటువైపు ఉన్నారో ఒకసారి చూసేద్దామా మరీ..

munugode bypoll
మునుగోడు ఉపఎన్నిక

Munugode election: మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, నాయకుల కొనుగోళ్లు, రాజకీయ పార్టీలు పోటీపడి పెడుతున్న ఖర్చుతో రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది. జెండాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధావత్‌లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వాహనాలతో మునుగోడు నియోజకవర్గమంతా సందడి నెలకొంది. ఇక్కడ తెరాస, భాజపా, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉన్నా..తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా?అనేలా పరిస్థితి నెలకొంది. తెరాసకు వామపక్షాల మద్దతు బలంగా మారగా, భాజపా ఎక్కువగా కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుపై ఆధారపడి ఉంది. వీరిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజులుగా ప్రచార ఉద్ధృతిని పెంచిన కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతమైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుకు పూర్తిగా గండికొట్టేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.

పట్టు బిగించిన తెరాస.. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పని చేస్తున్న తెరాస నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల తెరాస గెలుపొందగా రెండు చోట్ల భాజపా విజయం సాధించింది. మునుగోడులో ఇతర పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని మొత్తం పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రతి మూడు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే, మండలానికి ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, కార్పొరేషన్ల ఛైర్మన్లు.. ఇలా అందరూ ఆయా గ్రామాల్లోనే ఉంటూ తెరాస అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తున్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించారు. సామాజిక సమీకరణాలను బట్టి నాయకులను రంగంలోకి దింపుతున్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ కలిసి వందల మంది నియోజకవర్గంలోనే ఉంటూ పూర్తిగా పట్టుబిగించారు. జనాభా లెక్కలు సేకరించినట్లుగా ఇంటింటి సర్వే చేసి ఎవరేంటన్న పూర్తి సమాచారాన్ని తమ దగ్గర పెట్టుకొని ప్రచారంలో మార్పులు చేసుకొంటూ ముందుకెళ్తున్నారు.

వామపక్షాల మద్దతు తెరాసకు కీలకం.. తెరాసకు వామపక్షాల మద్దతు ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. నియోజకవర్గం నుంచి సీపీఐ అయిదుసార్లు గెలుపొందడం, ఉభయ కమ్యూనిస్టులకు కార్యకర్తలతోపాటు తగినంత ఓటింగ్‌ ఉండటం, ముఖ్య నాయకులంతా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటుండటంతో కిందిస్థాయి కార్యకర్తలు కూడా తెరాసతో కలిసి నడుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కొన్నిచోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెరాస, కమ్యూనిస్టుల మధ్య అవగాహన ఉంది. ఉదాహరణకు పుట్టపాక గ్రామంలో కరీంనగర్‌ జిల్లా నుంచి ఇన్‌ఛార్జిగా వెళ్లిన ఓ తెరాస ఎమ్మెల్యేతో కలిసి వామపక్షాల కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. నాలుగువేలకు పైగా ఓట్లున్న ఈ గ్రామంలో సర్పంచ్‌ తెరాస నేత కాగా ఉప సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు సీపీఎం వారు. ఒక స్కూలు కమిటీ తెరాసకు, ఇంకో స్కూలు కమిటీ అధ్యక్షపదవి సీపీఎంకు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వామపక్షాల వారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.

పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా తర్వాత బయటకు వచ్చారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించే లక్ష్యంతో తెరాసకు మద్దతు ఇవ్వడంతోపాటు ప్రచారంలో చురుగ్గా ఉన్నారు. ఇది తెరాసకు లాభించే అంశమనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమైంది.

తెరాసపై ఓటర్ల అభిప్రాయం.. 'చిన్నప్పటి నుంచి చెప్పులషాపు ఉంది, వాటి ధరలు విపరీతంగా పెరిగాయి, జీఎస్టీ భారం అదనం. సిలిండర్‌ ధర చాలా పెరిగింది, కొన్నేళ్లుగా ఇక్కడ ఏం పనులు జరగలేదు. అధికార పార్టీ అభ్యర్థే ఇక్కడ కూడా ఉంటే కొన్ని పనులు జరిగే అవకాశం ఉంది’ అని చౌటుప్పల్‌కు చెందిన పింజరి దుర్గాలాల్‌ అభిప్రాయపడ్డాడు. ‘గ్రామాల్లో మకాం వేసిన నాయకులు ప్రజల దగ్గరికి వెళ్లి కొన్ని పనులు చేయిస్తున్నారు. పెద్ద పనులు ఉంటే ఎన్నికల తర్వాత చేయిస్తాం అంటున్నారు. దీనివల్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది’ అని చౌటుప్పల్‌లో కిరాణాదుకాణం నిర్వహిస్తున్న వెంకటేశ్‌ పేర్కొన్నాడు. ‘నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. అధికార పార్టీ అయితే అవకాశం ఉంటుంది’ అని ఎల్లగిరి గ్రామానికి చెందిన ఉప సర్పంచి బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నుంచి తాము తెరాస వైపు వచ్చామని కూడా కొందరు చెప్పారు.

గెలిచి తీరాలన్న పట్టుదలతో భాజపా... రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన భాజపా, ఈ ఉప ఎన్నికలో కూడా గెలిచి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని నిరూపించడానికి పట్టుదలతో పని చేస్తోంది. నియోజకవర్గంలో భాజపాకు పట్టు లేకపోయినా తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఆయన కొన్నాళ్ల క్రితం రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉండటం వల్ల నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులను, ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకోవచ్చనే ధీమాతో పోటీకి దిగారు. ఇందులో కొంతవరకు సఫలీకృతమైనా, భాజపాకు గ్రామాల్లో క్యాడర్‌ లేకపోవడంతో ఎక్కువ గ్రామాల్లో పూర్తిగా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారిమీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాజపా ముఖ్యనాయకులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఈయనకు అండగా ప్రచారంలో ఉన్నారు.

భాజపా ముఖ్యనాయకులు, కేంద్రమంత్రి, ఎంపీలు, గత ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇలా అందరూ పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పని చేస్తున్నా, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఏ మేరకు రాజగోపాల్‌రెడ్డి వైపు వస్తుందన్న దానిపైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గతంలో గ్రామాల్లో కొందరికి వ్యక్తిగతంగా చేసిన సాయం ఉపయోగపడుతుందని కొందరు పేర్కొంటున్నారు. చేస్తామని చెప్పి చేయనివి కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.

భాజపా పార్టీపై ఓటరు అభిప్రాయం.. యువతకు నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. పీఈటీ చేసి డీఎస్సీ కోసం ఎదురుచూస్తూ, నోటిఫికేషన్‌ రాకపోవడంతో చిన్న దుకాణం పెట్టుకొన్నా అంటూ ఒకరు భాజపా అభ్యర్థి పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఆయన వ్యక్తిగతంగా పలు పనులు చేశారని నాంపల్లి మండలం, తుమ్మలపల్లికి చెందిన రామిరెడ్డి అనే రైతు పేర్కొన్నారు. ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్‌కు ఓటేసిన వారు కావడం గమనార్హం. భాజపాలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లేమి కూడా కొన్ని చోట్ల సమస్యగా ఉందనే అభిప్రాయాన్ని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు వ్యక్తం చేశారు. అధికార పార్టీ పట్ల కొన్ని వర్గాల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకత కూడా తమకు దోహదపడుతుందని మరి కొందరు అన్నారు. పోలింగ్‌ దగ్గరపడే సమయానికి కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది తమవైపే వస్తారని భాజపా నేతలు ధీమాతో ఉన్నా, ఆచరణలో ఏమేరకు సఫలీకృతులవుతారో చూడాల్సి ఉంది.

ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌... గతంలో ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి, ఇప్పుడు భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డి వెంట ఎక్కువ మంది నాయకులు వెళ్లడంతో ఉన్నవారిని కూడగట్టుకోవడానికే ఆమె ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యనాయకుల్లో కొందరు మాత్రమే అడపదడపా ప్రచారానికి వెళ్లినా, అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి గ్రామాల్లో ఆమె విసృత్తంగా పర్యటిస్తూ ఓటర్ల దగ్గరకు వెళ్లారు. గోవర్ధనరెడ్డికి నియోజకవర్గంలో ఉన్న గుర్తింపు, సంప్రదాయంగా కాంగ్రెస్‌ వైపు ఉండే ఓటర్లపై ఎక్కువగా ఆధారపడ్డారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో సహా పలువురు నాయకులు నియోజకవర్గంలో పర్యటించి సభలు , సమావేశాలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులతో గత కొన్ని రోజులుగా ప్రచారం పెరిగింది. ఓ స్థాయిలో జరుగుతున్న ప్రచారం, అభ్యర్థి పట్ల కొన్ని వర్గాల్లో.. ప్రత్యేకించి మహిళల్లో పెరుగుతున్న సానుభూతితో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగుపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్​పై ఓటరు అభిప్రాయం.. ‘కాంగ్రెస్‌ నుంచి అందరూ వెళ్లిపోయారనేది వాస్తవం కాదు, నాయకులు వెళ్లుండొచ్చు, కార్యకర్తలు, ఓటర్లలో మాత్రం ఎక్కువ మంది పార్టీతోనే ఉన్నారు’ అని పుట్టపాక గ్రామానికి చెందిన ప్రవీణ్‌ అనే కార్యకర్త అభిప్రాయపడ్డారు. నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన అబ్బాస్‌ అనే యువకుడు మాట్లాడుతూ ‘మొదటి నుంచి మా కుటుంబం కాంగ్రెస్‌తోనే ఉంది. గత ఎన్నికల్లో ఓటేసిన అభ్యర్థి పార్టీ మారారు. ఈ సారి నేను వేరే పార్టీకి ఓటేద్దామనుకొంటున్నా.. మా నాన్న మాత్రం కాంగ్రెస్‌కే వేస్తానంటున్నారు’ అని తెలిపారు.

ఈ మండలకేంద్రానికి చెందిన రైతు ఎట్టెయ్య కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘మేం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీనే. ఈ వయసులో ఇంకో పార్టీకి ఓటేయలేను. అయితే నా ఇద్దరు కొడుకులు మాత్రం ఇంకో పార్టీ అంటున్నార’ని చెప్పారు. ఇలా కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు కొంత పక్కకు వెళ్లిపోగా, కొంత మిగిలి ఉంది. గత కొన్ని రోజులుగా పెరిగిన ప్రచారం, అభ్యర్థి ఓటర్ల దగ్గరకు వెళ్తున్న తీరుతో సంప్రదాయ ఓటు తిరిగి ఎక్కువ భాగం కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఆ ఎన్నికలకు మించిన ఖర్చు.. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలు ధారాళంగా ఖర్చుచేస్తున్నాయి. ఇందులో రెండుపార్టీలు అత్యధికంగా వ్యయం చేస్తున్నాయి. అవి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో చేసిన ఖర్చును మించి ఇక్కడ చేసే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి భారీగా చెల్లించారు. గ్రామాల్లో రోజూ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రదర్శనలకు, మీటింగులకు వెళ్తే డబ్బు, మద్యం, బిర్యానీ ఇస్తున్నారు.‘ఇదంతా ఒక ఎత్తు, పోలింగు రోజున ఎవరెంత ఇస్తారో చూద్దాం.

చెప్పినా ఓట్లు పడని నాయకులకే అంత ఇస్తే, ఓట్లేసే మాకు ఎంత ఇవ్వాలి’ అంటూ కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం అభివృద్ధి పనులు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, తదితర అంశాల గురించి ప్రస్తావించారు. మరోవైపు బీఎస్పీ అభ్యర్థి తరపున ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీ అభ్యర్థి పొందే ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయో చూడాల్సి ఉందన్న అభిప్రాయం కూడా చర్చనీయాంశంగా ఉంది. మొత్తమ్మీద మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీల భవిష్యత్తుకు సవాలుగా మారగా, నవంబరు మూడున 2.41 లక్షల ఓటర్లు వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.