ETV Bharat / state

అన్నదాతల ఆవేదనలు.. ధాన్యం కొనుగోళ్లపై అధికారుల అలసత్వం

author img

By

Published : May 20, 2021, 7:34 PM IST

farmers protests at thukkapuram chourastha
తుక్కాపురం చౌరస్తా వద్ద రైతుల ధర్నా

ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుకు.. ఆ పంట అమ్ముకునేందుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినా వారి పట్ల కనికరం చూపడం లేదు. అకాల వర్షాలకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి అన్నదాతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం చౌరస్తా వద్ద ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. గతంలో పలుమార్లు ధర్నాలు చేపట్టినా జిల్లా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని కాంగ్రెస్​ నాయకులు విమర్శించారు. ఓ వైపు లాక్​డౌన్, మరో వైపు వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం అని ఆరోపించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రైతులను ఏనాడు పట్టించుకునే పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటుకు చిరంజీవి నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.