యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం చౌరస్తా వద్ద ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. గతంలో పలుమార్లు ధర్నాలు చేపట్టినా జిల్లా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఓ వైపు లాక్డౌన్, మరో వైపు వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం అని ఆరోపించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రైతులను ఏనాడు పట్టించుకునే పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుకు చిరంజీవి నిర్ణయం