అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే యువత అడవిబాటే : రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే యువత అడవిబాటే : రేవంత్ రెడ్డి
Revanth Reddy Vijayabheri Sabha in Warangal District : కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ప్రచార పర్వంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో స్థానిక అభ్యర్ధిని గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం వర్ధన్నపేట సభకు హాజరయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని.. నిరుద్యోగ యువతకు నట్టేట ముంచిన ఘనత బీఆర్ఎస్దేనని విరుచుకుపడ్డారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ.. దొర కాళ్ల కింద నలిగిపోతుందన్నారు.
Revanth Reddy Vijayabheri Sabha in Warangal District : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధిబాటవైపు నడవాల్సిన యువతను.. నిరుద్యోగులుగా(Unemployed) మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
Congress Election Campaign in Telangana : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియమ్మ(Sonia Gandhi) మనకు తెలంగాణ ఇచ్చారని.. అటువంటి పార్టీకి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో బూటకపు పాలన నడుస్తుందని విమర్శించిన రేవంత్ రెడ్డి.. బిల్లులు రావట్లేదని ఆవేదన చెందిన సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటామని తెలిపినట్లు వివరించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి(Errabelli Dayakar Rao).. బీరు సీసాలు అమ్ముకుని బిల్లులు కట్టుకోవాలనటం దారుణమన్నారు. యువకులకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ సమాజానికి అన్నివిధాలుగా నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం.. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని రేవంత్ రెడ్డి ఆశావహం వ్యక్తం చేశారు.
దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ అంటున్నారు. ఏ విషయంలో మొదటి స్థానం నిరుద్యోగ సమస్యలోనా.. రైతు ఆత్మహత్యల్లోనా.. కరువులోనా.. ఆడబిడ్డలపై జరిగే అఘాయిత్యాల్లోనా? ఎందులో అభివృద్ధి సాధించారు. ఇన్నాళ్లు సర్పంచులంతా బీఆర్ఎస్ జెండా మోస్తే.. చివరకు బిల్లులు చెల్లించక ఖాళీ బీరు బాటిళ్లే మోపిస్తారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మనం ఎన్నకున్నది కాదు. మనల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగ యువత ప్రభుత్వంతో కొట్లాడి చివరకు అడవిబాట పట్టే అవకాశం వస్తాది. :రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
Telangana Assembly Elections 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచార హోరు కొనసాగిస్తోన్న రేవంత్ రెడ్డి.. స్టేషన్ ఘనపూర్ సభ అనంతరం వర్ధన్నపేట విజయభేరి సభకు హాజరయ్యారు. వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజును గెలిపించాలని కోరిన రేవంత్రెడ్డి.. నియోజకవర్గంలో పోలీసుకు, దొంగకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధి కోసం తెచ్చుకున్న త్యాగాల తెలంగాణ.. దొర కాళ్ల కింద నలిగిపోతుందన్నారు. ధనిక రాష్ట్రంలో ప్రతీనెలా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం.. గజ్వేల్లో మాత్రం వంద గదులతో కేసీఆర్ గడీని నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.
