ETV Bharat / state

బంగారు ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Mar 29, 2023, 12:53 PM IST

Student commits suicide due to losing her ring బంగారు ఉంగరం పోయిందని... బంగారం లాంటి జీవితాన్ని బలి చేసుకుంది ఓ డిగ్రీ విద్యార్థిని. 'నాన్నా క్షమించు' అంటూ.. ఓ లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

warangal
warangal

పరీక్ష ఫెయిల్ అయ్యారనో... ప్రేమ విఫలమయిందనో... ఆత్మహత్య చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ ఓ విద్యార్థి.. తన గోల్డ్ రింగ్ పోయిందని ఆత్మహత్య చేసుకుంది. తన దగ్గర ఉన్న బంగారు ఉంగరం పోయిందని.. బంగారు భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఎక్కడా వెతికిన దొరకకపోవడంతో.. 'నాన్నా నన్ను క్షమించు' అంటూ ఓ లేఖ రాసి ఉరి వేసుకుంది. తిరిగిరాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గున్నేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న వివరాలు సేకరించారు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హేమలతా రెడ్డి. వయసు 19 సంవత్సరాలు. హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతుండగా... చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 8వ తరగతి చదవుతోంది.

ఇక ఈనెల 22వ తేదీన ఉగాది సందర్భంగా పెద్ద కుమార్తె హేమలతారెడ్డి ఇంటికి వచ్చింది. పండగ పూట అందరితో కలిసి మెలసి ఉండాలనుకుంది. ఇక బుధవారం తన చేతికున్న పావు తులం బంగారపు ఉంగరం ఎక్కడో పోగొట్టుకుంది. ఉంగరం పోయిందని తెలుసుకున్న హేమలతా రెడ్డి... అన్ని చోట్ల వెతికింది. ఇల్లంతా గాలించింది. ఎక్కడ దొరక్కపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురైంది.

అయితే ఆరు నెలల క్రితం బంగారు గొలుసు పోగొట్టుకుంది హేమలత. ఇప్పుడు మరోసారి ఉంగరం పోగొట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడింది. ఇక తాను చనిపోవడమే కరెక్ట్ అనుకుంది. ‘సారీ డాడీ.. నాకు భయమేస్తోంది’ అంటూ హేమలత నాన్నకు లేఖ రాసింది. అనంతరం ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు తలుపులు వేసి ఉండటంతో అనుమానం వచ్చి బద్ధలు కొట్టుకుని లోపలికి వెళ్లి చూశారు. ఓ గదిలో హేమలత ఉరేసుకుని ఉండటంతో.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే కిందకు దింపి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది.

పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి ఫోన్‌లో ఉన్న నంబర్ల సాయంతో తోటి మిత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా తండ్రికి రాసిన లేఖ దొరికింది. దానిని స్వాధినం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్‌ వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.