ETV Bharat / bharat

దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత సెల్​ ఫోన్లలోని డేటా సేకరణ

author img

By

Published : Mar 28, 2023, 12:19 PM IST

Updated : Mar 29, 2023, 7:44 AM IST

ED Letter to MLC Kavitha
ED Letter to MLC Kavitha

ED Letter to MLC Kavitha : దిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్‌ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా సేకరించారు. అంతకుముందే దీనిపై కవితకు ఈడీ లేఖ రాసింది. కవిత తరపున బీఆర్​ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఎలాంటి విషయాలు చెప్పబోనని సోమ భరత్‌ తెలిపారు.

ED Letter to MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో విచారణలో.. భాగంగా బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత అందించిన సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు తెరిచినట్లు తెలుస్తోంది. విచారణలో ఆమె సెల్​ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా సేకరించినట్లు సమాచారం. అంతకుముందే దీనిపై ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపిన ఈడీ జాయింట్ డైరెక్టర్... ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా పేర్కొన్నారు.

దీంతో... కవిత తరపున బీఆర్​ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. నిన్న ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. డేటా సేకరణ, సోమ భరత్‌ నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను పంపించేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఎలాంటి విషయాలు చెప్పబోనని సోమ భరత్‌ తెలిపారు.

ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ దురుద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిందన్న కవిత.. ఈనెల 21న వాటిని నేరుగా తీసుకెళ్లి ఈడీకి ఇచ్చారు. ఇలా ఇవ్వడానికి వెళ్లే ముందు ఇంటి దగ్గర.. ఆఫీసు దగ్గర వాటిని మీడియా ఎదుట చూపించారు. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదంటూ విచారణ అధికారికి అప్పుడు ఎమ్మెల్సీ కవిత ఓ లేఖ కూడా రాశారు.

కవిత పిటిషన్​పై 3 వారాలకు విచారణ వాయిదా : మరోవైపు తనకు ఈడీ సమన్లు జారీచేయడంపై.. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. గతంలో నళినీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌కు... కవిత పిటిషన్‌ను ట్యాగ్‌ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై గతంలో నళిని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 11న తొలిసారి కవితను విచారించిన ఈడీ... 16న మరోసారి హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.

అప్పుడు ఎమ్మెల్సీ కవిత చట్టప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని.. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేయగా... తిరస్కరించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మార్చి 24 విచారిస్తామని మొదట పేర్కొన్నా తర్వాత సోమవారం(మార్చి 27న) విచారణ జరుపుతామని వెల్లడించింది. ఇప్పటికే దీనిపై ఈడీ కెవియట్ దాఖలు చేయగా... ఈ రెండింటిపైనా సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎమ్మెల్సీ కవిత, వైఎస్సాఆర్​సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ప్రేమ్‌ రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ లీడర్లకు వందకోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారన్నది ఈడీ అభియోగం.

ఇవీ చదవండి:

Last Updated :Mar 29, 2023, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.