ETV Bharat / state

Mallanna Sagar: కాసేపట్లో మల్లన్న సాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

author img

By

Published : Feb 23, 2022, 5:32 AM IST

Updated : Feb 23, 2022, 10:47 AM IST

Mallanna Sagar: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ ఇవాళ జాతికి అంకింతం చేయనున్నారు. భారీ జలాశయంలోకి లాంఛనంగా నీటిని విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాసితుల త్యాగాల వల్లే మలన్నసాగర్‌ పూర్తైందని..... మంత్రి హరీశ్‌రావు పేర్కొనగా.. తెలంగాణ నీటిపారుదల రంగంలో ఇవాళ చరిత్రాత్మకమైన రోజని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు.

Mallannasagar will be dedicated to the nation by CM KCR today
Mallannasagar will be dedicated to the nation by CM KCR today

Mallanna Sagar: కాళేశ్వరం ఎత్తిపోతలలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఆసన్నమైంది. తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇవాళ ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్‌ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. భారీ మట్టికట్టతో.... 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేసి జలాశయం కలను సాకారం చేశారు.

15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు..

కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్‌ ద్వారానే నీటిని పంపుతారు. నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ జలాశయంపైనే ఆధారపడి ఉంది. డ్యామ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ జలాశయం ద్వారా 15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు కోసం 30 టీఎంసీలు భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే జలాలు అందనున్నాయి.

నిర్వాసితుల త్యాగాల వల్లే..

రాజకీయంగా, న్యాయపరంగా, స్థానికుల నుంచి ఎదురైన సమస్యలను అధిగమించి ప్రభుత్వం మల్లన్నసాగర్‌ను పూర్తి చేసింది. 8 గ్రామాలు పూర్తిగా, 4 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. 17 వేల 872 ఎకరాల భూమిని మల్లన్నసాగర్ కోసం సేకరించారు. 4200 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వీరి కోసం ప్రభుత్వం గజ్వేల్ సమీపంలో పునరావాస కాలనీ నిర్మించింది. నిర్వాసితుల త్యాగాల వల్లే మల్లన్నసాగర్‌ సాకారమైందని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

22.6 కిలో మీటర్ల మట్టి కట్ట..

మల్లన్నసాగర్‌ కోసం 22.6 కిలో మీటర్ల మట్టి కట్టను నిర్మించారు. ఇందుకోసం 14.36 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని వినియోగించారు. కట్ట కోతకు గురవ్వకుండా 27లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని రిబిట్‌మెంట్‌ కోసం వినియోగించారు. సొరంగం తవ్వకాల్లో వచ్చిన రాయిని ఇందుకు వినియోగించడం విశేషం. జలాశయంలో పూర్తిస్థాయిలో నిల్వ చేస్తే 75 చదరపు కిలో మీటర్ల పరిధిలో నీరు నిల్వ ఉండనుంది.

ప్రస్తుతం 10.5 టీఎంసీల నీటి నిల్వ..

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్‌ గ్రామం వద్ద లిప్టు నిర్మించారు. ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. వీటి నుంచి సుమారు 0.85 టీఎంసీ నీటిని రోజూ మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోయనున్నారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5టీఎంసీల నీటిని నింపారు. మొదటిసారిగా నీటి నిల్వతో తలెత్తే సమస్యలను పరిశీలించిన తర్వాత మరో 5 టీఎంసీలను నింపారు. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నీటిపారుదల రంగంలో చారిత్రక దినం..

మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌లో మోటర్లను ఆన్‌ చేసి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మల్లన్నసాగర్‌ ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగంలో.... చారిత్రక దినమని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 23, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.