వెడల్పయిన రహదారులు.. బారులు తీరిన ఇళ్లు.. వీటిని కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం భూ నిర్వాసితులతో గృహ ప్రవేశాలు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధిలోని సంగాపూర్లో సకల సౌకర్యాలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తోంది. ఈ వారంలోనే ఇళ్లను అప్పగించే కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు కలెక్టర్ వెంకటరామరెడ్డి జిల్లా స్థాయి అధికారులతో 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వారి పర్యవేక్షణలో పనులు తుది దశలో ఉన్నాయి.
మొత్తం 600 ఎకరాలు సేకరించగా నిర్వాసితులకు 2500 ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. మరో 3వేల మందికి ఇక్కడ ఇళ్లస్థలాలు కేటాయిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో త్యాగధనుల కాలనీ సిద్ధమవుతోంది. కాలనీలోని ఇళ్లను తొగుట మండలం లక్ష్మాపూర్, రాంపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులకు కేటాయించారు.
ఇదీ చదవండి: ఉద్యోగం నుంచి ప్రొ. సాయిబాబా తొలగింపు