Hens Distribution Under ICAR in Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మెట్లకుంట, హుసెల్లి గ్రామాల్లో ఎస్సీ మహిళా రైతులకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద జాతీయ మాంస పరిశోధన సంస్థ సమన్వయంతో కృషివిజ్ఞాన కేంద్రం ద్వారా రెండు యూనిట్ల పెరటి కోళ్లను పంపిణీ చేశారు. మెుత్తం రెండు గ్రామాలకు కలిపి 55 మంది మహిళా రైతులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి 20 కోళ్ల చొప్పున పంపిణీ చేశారు. వాటితో పాటు 20 కిలోల దాణా, కోళ్లకు నీటిని అందించే ఫీడర్, దాణా పెట్టడానికి మరో తొట్టెను ఉచితంగా అందించారు.
ప్రధానంగా గ్రామీణ మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొందొచ్చు అని అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టు జాతీయ మాంస పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బసవరెడ్డి తెలిపారు. కోళ్ల పంపిణీయే కాకుండా వాటిని ఎలా సంరక్షించాలి. వాటికి ఇవ్వాల్సిన మేత, నీరు గురించి పూర్తిగా వివరించారు. పంపిణీ చేసిన కోళ్లు ఏడాదికి 120 నుంచి 180 వరకు గుడ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల ఆదాయం అందుతోంది. దాంతో పాటు మంచి నాణ్యత గలిగిన మాంసాన్ని తినడంతో మంచి పోషకాలు లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Kadaknath Poultry farming: కడక్నాథ్ కోళ్ల పెంపకం.. రెట్టింపు ఆదాయం..
"ఐసీఎఆర్ సమన్వయంతో కోళ్ల పంపిణీ సాధ్యమైంది. సాధారణ నాటు కోళ్ల కంటే ఈ పెరటి కోళ్లు నెలన్నర రోజుల్లోనే మాంసానికి వస్తాయి. దీని గుడ్డు ఒక్కోటి 8 నుంచి 10 వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీని ద్వారా నెలకు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. నాటు కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో మహిళలు సొంతంగా ఆదాయాన్ని పొందడానికి మంచి అస్కారం ఉంది."
- రమేశ్, పంటల పరిశోధన శాస్త్రవేత్త, కృషివిజ్ఞాన కేంద్రం
ఆ ఇంజినీర్ 'నాటు కోడి' వ్యాపారం సూపర్ హిట్!
సంఘం ద్వారా ఏర్పాటు చేసిన సమావేశాల్లో పలు మార్లు కోళ్ల పెంపకం గురించి ప్రస్తావించడంతోనే ఇప్పుడు తమకు కోళ్లు వచ్చాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కోళ్ల పెంపకాన్ని వృద్ధి చేస్తామని మహిళా రైతులు చెబుతున్నారు. తమకు ఆదాయ మార్గాన్ని చూపిన వ్యవసాయ శాఖకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
జాతి కోళ్లు బరువులోనే కాదు ధరలోనూ అదిరిపోతుంది
"ఇలాంటి ప్రభుత్వ ప్రోత్సాహాలతో పురుషులతో పాటు మహిళలు కూడా ఆదాయాన్ని పొందవచ్చు. చన్నీళ్లకు వేడినీళ్లు అన్న చందాన ఎంతో కొంత ఆదాయంతో పాటు ఇంట్లో గుడ్లు, మాంసం అందుబాటులో ఉండటంతో కొంత ఆర్థిక ఖర్చు తగ్గుతోంది. దీన్ని మరింత విస్తరిస్తే ఇంకా అనేక మందికి లాభసాటిగా ఉంటుంది." అని మహిళా రైతులు అంటున్నారు.