ETV Bharat / state

Drinking Water Problem in Sangareddy : పక్కనే మంజీరా.. కానీ తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కరవాయే!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 2:34 PM IST

water crisis at sangareddy district
Drinking Water Problem in Sangareddy

Drinking Water Problem in Sangareddy : ఊరు పక్కనే మంజీరా ప్రాజెక్ట్​. కానీ తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. ప్రాజెక్ట్​ నిర్మాణంలో వారు భూములనే వదులుకున్న ఆ గ్రామాల ప్రజలకు ఇప్పుడు తాగునీరు కరువైంది. మిషన్​ భగీరథ నీళ్లు వస్తున్నా.. అవి కలుషితంగా ఉండటంతో ఓవైపు వాటిని తాగలేక.. మరోవైపు నీళ్లు తాగలేక ఉండలేక మూడు గ్రామాల ప్రజలు దాహంతో తల్లడిల్లిపోతున్నారు.

Drinking Water Problem పక్కనే మంజీరా.. కానీ తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు కరవాయే

Drinking Water Problem in Sangareddy : తలాపున గోదారి పారినా మన చేను, చెలకలు ఎండినా దైన్యాన్ని స్వరాష్ట్ర ఉద్యమం నిలదీసింది. అచ్చం, అలాంటి ఇబ్బందే ఇప్పుడు మరో మూడు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరందించే మంజీరా.. ఆ పంచాయతీ పరిధిలోనే ఉన్నా గుక్కెడు మంచినీళ్లు వారికి అందని ద్రాక్షగా మారాయి. మిషన్‌ భగీరథ ద్వారా వస్తున్న అపరిశుభ్ర నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించి భూములు కోల్పోయిన తమకు తాగునీటి సమస్య తీర్చాలంటున్న బాధితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Drinking Water problems Manjira Project Villages : సంగారెడ్డి జిల్లాలోని కల్పూరులో మంజీరా ప్రాజెక్టు ఉంది. కానీ, అదే పంచాయతీతో పాటు అంగడిపేట్‌, గంజిగూడ గ్రామాలకు మాత్రం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరకట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచే హైదరాబాద్‌, సంగారెడ్డి వంటి ప్రధాన పట్టణాలకు తాగునీరు సరఫరా అవుతోందని వెల్లడిస్తున్నారు. మిషన్‌ భగీరథ(Mission Bhagiratha) ద్వారా వచ్చే నీళ్లలో బురదతో పాటు తోకపురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. మంజీరా ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంతో పాటు భూములు ఇచ్చినా.. నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వాతావరణ ప్రభావంతో విషజ్వరాలు విజృంభిస్తుండగా మరోవైపు కలుషిత నీటితో వచ్చే జబ్బులతో ఆస్పత్రి ఖర్చులు భారమౌతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

"ఐదు రోజుల నుంచి మురికి నీరు వస్తోంది. మా గ్రామం దగ్గరల్లోనే మంజీర డ్యామ్ ఉంది. నిర్మాణానికి మేము కష్టపడ్డాం. మా భూములు ఇచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడికో మంచి నీళ్లు తీసుకువెళ్తున్నారు. మాకు మాత్రం మంచి నీళ్లు రాలేదు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా అవి మురికిగా ఉంటున్నాయి. వాటిని తాగితే అనారోగ్యం వస్తుందేమో భయంగా ఉంది. నీళ్లు కొనుక్కునే స్థోమత మాకు లేదు." - స్థానిక మహిళ

Kalpur Villagers Demands : సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందించట్లేదన వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందించట్లేదని రోడ్డుపై ముళ్ల కంచెలతో ఆందోళన(Villagers Protest) నిర్వహించారు. కల్పూరు గ్రామ పంచాయతీలో నాలుగైదు ఓవర్‌హెడ్‌ ట్యాంకులున్నా వాటిని శుభ్రం చేసి ఏళ్లు గడుస్తుంది. పలు చోట్ల ట్యాంకుల్లోకి నీరు ఎక్కించే మోటార్లు, పైపులు మురుగు నీటిలో నానుతున్నాయి. దీని బట్టి ఆయా గ్రామాల్లో మంచినీటి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమౌతోంది. అధికారులు స్పందించి తమకు మంజీరా నీటిని అందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. త్వరితగతిన మంచినీరు అందించే చర్యలు తీసుకుంటే గ్రామస్థులను జబ్బుల బారిన పడకుండా కాపాడొచ్చని స్థానికుల ఆవేదన.

Water Problem in Bhadrachalam : 'రామయ్యా.. ఏందయ్యా మాకీ దుస్థితి..?'

'తాగునీటి సమస్య లేకుండా చేస్తా'

నీరు కావాలంటే.. పొలానికి వెళ్లాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.