Water Problem in Bhadrachalam : 'రామయ్యా.. ఏందయ్యా మాకీ దుస్థితి..?'
Bhadrachalam Water Problem : భద్రాచలంలోని గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద యాత్రికులకు తాగునీరు లేక దాహంతో తల్లడిల్లిపోతున్నారు. భద్రాద్రి ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు .. గోదావరి నది వద్దకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తారు. గోదావరి కింద నుంచి మెట్లు ఎక్కి ఓడ్డుకు చేరుకునేసరికి ఆయాసంతోపాటు దాహంతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులకు, వృద్దులకు మరీ ఇబ్బందికరంగా పరిస్థితి మారింది. రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులంతా.. 'రామయ్యా.. మాకీ ఏంది ఈ దుస్థితి' అంటూ స్వామిని తలచుకుంటూ వాపోతున్నారు.
గతంలో గోదావరి స్నాన ఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతంలో తాగునీరు ఏర్పాటు చేసిన అధికారులు గత నాలుగు సంవత్సరాల నుంచి వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. తాగునీరు కోసం ఏర్పాటు చేసిన నల్లాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గోదావరి ప్రాంతానికి స్నానాల కోసం వచ్చే భక్తులు ప్రస్తుతం దాహంతో అలమటిస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు వెంటనే తాగునీరు ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు అధికారులను కోరుతున్నారు.