Local body MLC Elections Telangana: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థుల నామినేషన్లు

author img

By

Published : Nov 22, 2021, 11:58 AM IST

Updated : Nov 22, 2021, 5:09 PM IST

Local body MLC Elections Telangana, Local Bodies Quota MLC Elections

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్లు(Local body MLC Elections Telangana) దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు తెరాస అభ్యర్థులుగా శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామ పత్రాలు సమర్పించారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు(Local body MLC Elections Telangana) తెరాస అభ్యర్థులుగా శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామ పత్రాలు సమర్పించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో శంభీపూర్ రాజు, మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

పోచంపల్లి నామినేషన్

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్​లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామపత్రాలు సమర్పించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా... ఆయన తరఫున మరో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్​తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను వేశారు. అనంతరం జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు, ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ వాసుదేవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

Local body MLC Elections Telangana, Local Bodies Quota MLC Elections
మంత్రి సత్యవతితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

మంత్రుల సమక్షంలో నామపత్రాలు

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం అభిప్రాయపడ్డారు. రైతు బంధువుగా ఉన్న సీఎం కేసిఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు తెరాసకు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు.

తాతా మధు నామినేషన్

ఖమ్మం స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థి తాతా మధు తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​తోపాటు తెరాస ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్​కు నామపత్రాలు అందజేశారు. తొలుత తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్.. తాతామధుకు పార్టీ బీ ఫారం అందజేశారు. అక్కడి నుంచి అంతా కలిసి కలెక్టరేట్​కు వెళ్లి... నామినేషన్ దాఖలు చేశారు.

Local body MLC Elections Telangana, Local Bodies Quota MLC Elections
తాతా మధు నామినేషన్

కాంగ్రెస్ నేతలకు నిరాశే..

ఖమ్మం జిల్లా ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్​కు వచ్చిన కాంగ్రెస్ నేతలు రాయల నాగేశ్వరర రావు, బెల్లం వేణు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. నామినేషన్ వేసేందుకు ముందే లోపలికి వచ్చినప్పటికీ... తెరాస అభ్యర్థి తాతా మధు నామినేషన్ దాఖలుకు ఎక్కువ సమయం పట్టగా.. ఇద్దరు నాయకులు అక్కడే ఎదురుచూశారు. తీరా తెరాస నేతలు బయటకు వచ్చాక లోపలికి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు.. నామినేషన్ దాఖలుకు సమయం అయిపోయిందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఫలితంగా ఇద్దరు నేతలు వెనుదిరిగారు. మంగళవారం నామినేషన్లు దాఖలు చేస్తామని... పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే బరిలో నిలుస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ( Local Bodies Quota MLC Elections) నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి... 14న ఓట్లను లెక్కిస్తారు.

ఇదీ చదవండి: MLC Elections: తెలంగాణలో ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నేటినుంచే కోడ్ అమలు

Last Updated :Nov 22, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.