ETV Bharat / state

Teegala will Joins in Congress : బీఆర్​ఎస్​కు బిగ్ షాక్​.. 'కారు' దిగి 'చేయి' అందుకోనున్న తీగల కృష్ణారెడ్డి!

author img

By

Published : Jul 18, 2023, 6:20 PM IST

Teegala Krishnareddy
Teegala Krishnareddy

BRS Leader Teegala will Joins in Congress : అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్​ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనితతో కలిసి తీగల.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కారు దిగి.. కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Teegala Krishnareddy will Joins in Congress : ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్​రావు ఠాక్రేతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరిలతో సమావేశమైన వీరు.. తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానమిలా..: తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పని చేశారు. హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన తీగల.. 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి... సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, బీఆర్​ఎస్​లో చేరిన తీగల.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయారు. అనంతరం సబితా హస్తం పార్టీని వీడి కారెక్కి మంత్రి అయ్యారు.

Rangreddy Zp Chairman Anitha will Joins in Congress : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి.. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని టీకేఆర్​ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే బీఆర్​ఎస్ టికెట్‌ వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడటంతో పార్టీ మారటమే మేలని తీగల భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత నెలాఖరున ఈటీవీ-ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్‌ ఇవ్వకుంటే కారు దిగటం ఖాయమని వ్యాఖ్యానించారు.

త్వరలో కాంగ్రెస్​లో చేరనున్న తీగల కృష్ణారెడ్డి : అసంతృప్తిగా ఉన్న తీగలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, పొంగులేటి, జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కండువా కప్పుకోవటంతో అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆయన మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే తన కోడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్​పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

రేపు దిల్లీకి రేవంత్, మాణిక్​రావ్ ఠాక్రే : మరోవైపు ఈ నెల 20వ తేదీన దాదాపు పది మంది నాయకులు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్​రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలు దిల్లీ వెళ్లనున్నారు. గద్వాల్‌ జడ్పీ ఛైర్​పర్సన్‌ సరిత, ఆమె భర్త తిరుపతయ్యలతో పాటు ఓ మున్సిపల్‌ ఛైరపర్సన్‌, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఇద్దరు నుంచి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.