ETV Bharat / state

ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోదీ చమురు ధర పెరుగుతోంది: కేటీఆర్

author img

By

Published : Oct 22, 2022, 5:54 PM IST

KTR
KTR

KTR Fires on BJP: ఇంధన, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల నుంచి రూ.30 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్‌ రూపంలో లాక్కుంటున్నారని విమర్శించారు. ఆయిల్‌ కంపెనీలకు రాయితీ ఇస్తున్న కేంద్రం.. సిలిండర్‌ ధరలకు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Fires on BJP: రాష్ట్రంలో కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించి.. రూ.30 లక్షల కోట్లు గుంజుకున్నది చాలు అన్న కేటీఆర్.. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి లీటరు పెట్రోలు రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోదీ చమురు ధర పెరుగుతోంది: కేటీఆర్

'8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రపంచ నగరాలతో హైదరాబాద్‌ పోటీపడుతోంది. ఫ్లోరోసిస్‌ వ్యాధిని రూపుమాపింది కేసీఆర్‌ ప్రభుత్వం. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. ఈనాడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. బియ్యం కొనుగోళ్లకు అడ్డుపడుతున్నారు. నూకలు తినండన్న భాజపాకు ఓటు వేయాలా? పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచేశారు.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

సామాన్యుడి ముక్కు పిండి వసూలు చేసింది చాలు.. 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పుడు క్రూడాయిల్‌ ధర 94 డాలర్లు.. ఈ రోజు క్రూడాయిల్‌ ధర 98 డాలర్లుగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందులో మాత్రం పెద్దగా తేడా లేదు అన్నారు. అయినా, ఆ రోజు లీటరు పెట్రోల్‌ ధర రూ.70, ఈ రోజు లీటర్​ పెట్రోలు ధర రూ.112కి చేరిందన్న ఆయన.. పెట్రోలు రేటు ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలేమైనా పన్నులు పెంచాయా అని కేటీఆర్ నిలదీశారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోదీ చమురు ధర పెరుగుతోందని ఎద్దేవా చేశారు. సామాన్యుడి ముక్కు పిండి వసూలు చేసింది చాలు.. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్సు రద్దు చేయాలని పేర్కొన్నారు. లీటరు పెట్రోలు రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.