ETV Bharat / state

జంట హత్యలపై భగ్గుమన్న బార్‌ కౌన్సిల్‌

author img

By

Published : Feb 17, 2021, 9:07 PM IST

వామన్‌రావు దంపతుల హత్యను ఖండించిన బార్‌ కౌన్సిల్‌
వామన్‌రావు దంపతుల హత్యను ఖండించిన బార్‌ కౌన్సిల్‌

గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య న్యాయవాదుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. వామన్‌రావు తమకు ప్రాణహాని ఉందని పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. ముఖ్యంగా పోలీసుల వల్ల తమకు ప్రమాదం ఉందని ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు ఆందోళన చెందిన విధంగా హత్యకు గురవడం హైకోర్టులో అందరినీ ఆవేదనకు గురిచేసింది. హత్యను రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండించింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని న్యాయవాద సంఘాలు నిర్ణయించాయి.

వామన్ రావు, నాగమణి దంపతుల హత్య న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యను రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి కోరారు. గురువారం మధ్యాహ్నం హైకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేయాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సంఘాలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి, డీజీపీకి పంపించాలని అసోసియేషన్ కోరింది. నిందితుల తరఫున న్యాయవాదులు వాదించవద్దని బార్‌ కౌన్సిల్‌ కోరింది.

ప్రాణహాని ఉందని సీజేకు ఫిర్యాదు

వామన్ రావు, నాగమణి దంపతులు హైకోర్టులో చురుగ్గా ఉండేవారు. మంథనికి చెందిన వామన్ రావు, శ్రీకాకుళానికి చెందిన నాగమణిది ప్రేమ వివాహం. హైకోర్టు విభజన ఉద్యమాల్లోనూ ఇద్దరూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పలు వివాదాస్పద అంశాల్లో సామాజిక మాధ్యమాల్లో స్పందించే వారు. కరోనా సమయంలో పేద న్యాయవాదులతో పాటు వివిధ వర్గాలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. కానీ ఇటీవల పలు కేసుల విషయంలో తమకు ప్రాణహాని ఉందని వామన్‌రావు దంపతులు సీజేకు ఫిర్యాదు చేశారు. అంతలోనే హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది.

పలు వివాదాలపై వ్యాజ్యాలు

తమకు ప్రాణ హాని ఉందని ఇటీవల వామన్ రావు, నాగమణి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వామన్ రావు పలు వివాదాలపై పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. మంథని పోలీస్ స్టేషన్​లో శీలం రంగయ్య అనే నిందితుడి లాకప్ డెత్​పై చర్యలు తీసుకోవాలని.. నాగమణి రాసిన లేఖను హైకోర్టు ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు నియమించిన విచారణ అధికారి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్.. శీలం రంగయ్య మృతిలో పోలీసుల తప్పేమీ లేదని నివేదిక సమర్పించారు. అయితే శీలం రంగయ్య మృతిపై లేఖ రాసినప్పటి నుంచి పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వామన్ రావు, నాగమణి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. వామన్ రావు, నాగమణిలను పోలీస్ స్టేషన్​కు పిలిపించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీ చేసింది. తమకు పోలీసులతో ప్రాణహాని ఉందని వామన్‌రావు... ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణ, మందమర్రి సీఐ ఎడ్ల మహేష్, మంచిర్యాల సీఐ ముత్తిలింగం, జైపూర్ ఏసీపీ నరేందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ ఆకునూరి మహేందర్, ఎస్సై ఓంకార్ యాదవ్​లను బదిలీ చేయాలని, లేకపోతే వారి వేధింపులు ఆగవని.. తాము కేసులు వాదించలేమని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.