నిజామాబాద్​ జిల్లాలో విష జ్వరాల విజృంభణ

author img

By

Published : Sep 15, 2022, 11:00 PM IST

కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు

Viral fevers in Nizamabad district : విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా జ్వరంతో బాధ పడుతున్న పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. సాధారణ జ్వరంతోపాటు డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

నిజామాబాద్​ జిల్లాలో విష జ్వరాల విజృంభణ

Viral fevers in Nizamabad district: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతుండటంతో సీజనల్‌ వ్యాధులు పెరిగిపోతున్నాయి. రోగాల బారిన పడుతున్న బాధితులంతా ఆస్పత్రులకు వరుస కడుతున్నారు. సర్కార్‌ దవాఖానాలతోపాటు ప్రైవేట్‌లోనూ రద్దీ నెలకొంది. విష జ్వరాల బారినపడే వారి సంఖ్య పెరిగింది. వైరల్ ఫీవర్స్‌తో రోగులు సతమతమవుతున్నారు.

మలేరియా కొంత అదుపులో ఉన్నప్పటికీ డెంగ్యూ కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది. రోజువారీగా ఆస్పత్రికి వచ్చే రోగుల తాకిడి రెట్టింపైంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టుతో పోలిస్తే జ్వరాలతో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపైంది. జూన్‌లో 1080, జులైలో 1360 మంది మాత్రమే జ్వరాలతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆగస్టు నెలలో 2 వేల 4 మంది జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 416 మంది జ్వరాల బారిన పడ్డారంటే వ్యాధుల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

గత నెలలో 36 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈనెలలో ఇప్పటికే 48 కేసులు నమోదయ్యాయి. కనీసం రోజుకు రెండు నుంచి మూడు కేసులు నమోదవుతున్నాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నగరపాలక సంస్థ అధికారులు ఫాగింగ్‌చేయించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.