ETV Bharat / state

NIZAMABAD RAINS: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన.. పొంగిపొర్లుతున్న వాగులు

author img

By

Published : Jul 22, 2021, 8:46 PM IST

Updated : Jul 22, 2021, 9:13 PM IST

NIZAMABAD RAINS
ఎడతెరిపి లేని వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వాగులు పొంగి చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారంలోగా చాలా వరకు చెరువులు నిండే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తుంపల్లి, గడుకోల్ గ్రామాల వద్ద వాగు.. వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. ఇదే మండలంలోని రావుట్ల పరిధిలో ఎదుల్లా చెరువు నిండి అలుగు దూకుతోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు

పూర్తిగా నీట మునిగిన శివాలయం

రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద త్రివేణి సంగమంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటిప్రవాహంతో... నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీట మునిగింది. నవీపేట మండలంలోని జన్నేపల్లి వాగు వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేల్పూర్ మండలంలోని పెద్ద చెరువు 30 ఏళ్ల తర్వాత నిండింది. డిచ్​పల్లి మండలం సుద్దులం చెక్ డ్యామ్ అలుగు పారుతోంది. సిరికొండ మండలంలో చెరువులు అలుగు పారి రోడ్డుపైకి నీరు చేరింది. బీబీపేట మండలంలోని ఎడ్లకట్టవాగు, మానాల వాగు పొంగి పొర్లుతున్నాయి. మోర్తాడ్ మండలంలోని ముసలమ్మ చెరువు అలుగు పారుతోంది. నందిపేట మండలంలో వాగులు పొంగి పొర్లి... వెయ్యి ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. వేల్పూర్ మురుసుకుంట చెరువు అలుగు పోస్తుంది. అదే మండలంలోని పడిగెల గ్రామ నవాబ్ చెరువు నిండి పడిగెల-ఆర్మూర్ ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.

చెరువులు నిండుతున్నాయ్..

జక్రాన్​పల్లి మండల కేంద్రంలోని చెరువు నిండి అలుగు పోయడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ధర్పల్లి మండలంలోని వాడి వాగు జలకళను సంతరించుకుంది. దీనిని చూసేందుకు స్థానికులు బారులు తీరారు. హోన్నజీపేట్ చెరువు కింద వరదనీటిలో దాదాపు 50 ఎకరాల పంట నీట మునిగింది. వరి నాట్లు పూర్తయిన వారంలోనే పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇందల్వాయి మండలంలోని పెద్ద చెరువు, సిర్ణపల్లిలోని జానకి బాయ్ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే అలుగు పారే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఇన్​ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా... 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 1090.40 అడుగులు ఉంది. విద్యుదుత్పత్తి చేస్తూ... 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు వద్దకు మంత్రి ప్రశాంత్​ రెడ్డి వెళ్లారు. కలెక్టర్​, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఎస్పీకి వరద, నీటి విడుదలపై చర్చించారు. లోతట్టు గ్రామాల సర్పంచ్‌లతో ఫోన్‌లో మాట్లాడి... అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 3,144 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1464.00 అడుగులకు 1459.66 అడుగులకు చేరుకుంది. కల్యాణి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 198 క్యూసెక్కుల వరద నీరు రావడంతో... డైవర్షన్ కాలువ ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి నీటిని మళ్లించారు.

సింగీతం రిజర్వాయర్​లో నీటి మట్టం 416.550 మీటర్లకుగాను 416.350 మీటర్లలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,120 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... అంతే మొత్తంలో నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 2,673 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. బీర్కూర్, బాన్సువాడ మండలంలోని పలు చెరువులు, వాగులు నిండాయి. ఎడ తెరిపి లేకుండా కురుసున్న వర్షానికి పంట పొలాలు నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: FLOOD REPORT: భారీగా చేరుతున్న వరద నీరు... నిండుకుండలా జలాశయాలు

Last Updated :Jul 22, 2021, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.