ETV Bharat / state

ఆ పల్లెలు.. స్థానిక ప్రజాప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్నాయి..

author img

By

Published : Oct 17, 2022, 4:30 PM IST

ఆ పల్లెలు స్థానిక ప్రజాప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. వార్డు సభ్యులు మొదలు.. జడ్పీ వైస్‌ ఛైర్మన్ వరకు ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికల నిర్వహణ అంశం ఊసే లేకుండాపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 219 సర్పంచ్‌ స్థానాలతో పాటు 94 ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 5,353 వార్డులకు సభ్యులు లేరు. వాటితో పాటు జడ్పీ వైస్‌ ఛైర్మన్, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా చోట్ల ఎన్నికల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ కొనసాగుతోంది.

స్థానిక సంస్థలు
Local institutions

స్థానిక ప్రజాప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్న పల్లెలు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో పలు స్థానాలు ఖాళీ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఎన్నికలు నిర్వహించే ఊసేలేకుండాపోవడంతో ఆయా పల్లెలు, ప్రాంతాలు ప్రజాప్రతినిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 2019లో సాధారణ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికైన వారిలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు మరణించారు. కొన్నిచోట్ల రిజర్వేషన్‌కు తగ్గట్లు ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరోవైపు ఎన్నికైన అభ్యర్థులపై అనర్హత వేటు పడటంతో ఆ పదవులు ఖాళీగా మిగిలిపోయాయి. ఆయా గ్రామాలు, వార్డులకు ప్రాతినిథ్యం వహించే ప్రతినిధులు లేకుండాపోయారు. కొన్నిచోట్ల గత మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించక పోవడంతో ఆయాస్థానాలు ఖాళీగా ఉన్నాయి.

219 సర్పంచ్ ఖాళీలు: రాష్ట్రవ్యాప్తంగా 219 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి, ములుగు, నారాయణపేట మినహా మిగిలిన 29 జిల్లాల్లోనూ పలు చోట్ల సర్పంచులు లేరు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 15, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 13 చొప్పున, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో 11 చొప్పున, నిజామాబాద్‌లో 10 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

94 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు: రాష్ట్రంలో 94 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గరిష్టంగా ములుగులో 15, గద్వాలలో 10, వికారాబాద్‌లో 9 ఎంపీటీసీ స్థానాలకు ప్రాతినిథ్యం వహించే వారే లేరు. ఆదిలాబాద్, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

రికార్డు స్థాయిలో వార్డు సభ్యుల ఖాళీలు: రాష్ట్రవ్యాప్తంగా 5353 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 757, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 521, వనపర్తిలో 387, మంచిర్యాలలో 367, మహబూబ్‌నగర్‌లో 355, రంగారెడ్డిలో 339, వికారాబాద్‌లో 327 వార్డులు ఖాళీగా ఉన్నాయి. పరోక్ష ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ జడ్పీ వైస్‌ఛైర్మన్ పదవితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు ఏంపీపీ పదవుల్లో ప్రస్తుతం ఎవరూ లేరు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 2, ఆదిలాబాద్, మేడ్చెల్, గద్వాల, ములుగు జిల్లాల్లో ఒక్కో ఎంపీపీ పదవి ఖాళీగా ఉంది. మంచిర్యాల, కరీంనగర్,ములుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు ఏంపీపీ, వైస్‌ఛైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 344 చోట్ల ఉపసర్పంచ్‌లు లేరు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 74, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44, రంగారెడ్డిలో 38, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో 26 చొప్పున ఉపసర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటర్ల జాబితా తయారీకి గత ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఆయా పంచాయతీల్లో ప్రక్రియ పూర్తైంది. ఎన్నికల నిర్వహణకు మాత్రం నోచుకోలేదు. హైకోర్టు ఆదేశాలతో ఒకటి, రెండుచోట్ల ఎన్నికలు జరిగాయి. మిగతా చోట్ల జరపలేదు. ఖాళీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అక్కడ నుంచి అనుమతివస్తే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.