ETV Bharat / state

మేడారం మహాజాతరకు ముంచుకొస్తున్న సమయం - అయినా పట్టాలెక్కని అభివృద్ధి పనులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 9:46 AM IST

Medaram Jatara 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ సమయం ఆసన్నమవుతోంది. జంపన్నవాగు జన సంద్రంగా మారే ఘడియలు సమీపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే కీకారణ్యం జనారణ్యమై కోలాహలంగా మారనుంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే మేడారం మహా జాతరకు ఇంకా 72 రోజులు మాత్రమే ఉంది. కానీ నిధుల జాప్యంతో ఇప్పటికీ అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదు.

Medaram Jatara 2024
Medaram Jatara 2024

Medaram Jatara 2024 : కాకతీయ సేనలు గిరిపుత్రులను వేధింపులకు గురి చేస్తుంటే కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలు. వందల సంవత్సరాలు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ జాతర నిర్వహిస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభ అవుతుంది. వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర (Medaram Jatara 2024) మొదలవుతుంది.

అలాంటి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన సమక్క- సారలమ్మ జాతరకు (Sammakka Saralamma Jatara 2024 )సమయం ఆసన్నమవుతోంది. రెండు సంవత్సరాలకు ఒక సారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

Mini Medaram: ఆగ్రహంపాడ్‌ మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Delay in Medaram Jatara Arrangements 2024 : ప్రతిసారి కనీసం నాలుగు నెలల ముందు నుంచైనా జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే మొత్తం 21 శాఖలు రూ.75 కోట్ల విలువైన ప్రతిపాదనలను జులైలోనే సిద్ధం చేశాయి. దాదాపు 5 నెలలు అవుతున్నా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఇప్పటికీ పట్టాలెక్కలేదు.

చేపట్టాల్సిన పనులెన్నో : జాతరలో రహదారుల నిర్మాణం, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, హోల్డింగ్‌ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. జాతరకు ఇంకా 72 రోజులు మాత్రమే ఉంది.

నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం : నిధుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. మధ్యలో కోడ్‌ రావడంతో నిధుల కేటాయింపులో ఆలస్యం అయిందని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తికావడంతో, జాతర ఏర్పాట్లపై దృష్టి పెట్టామని వివరించారు. నిధుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. త్వరలోనే పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అంకిత్ వెల్లడించారు.

Medaram: సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే..?

జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం కాగా, మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్త కోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు కోటిమందికి పైగా భక్తులు వస్తారు. భక్తి భావంతో అమ్మలను దర్శించుకుంటారు. పిల్లాపాపాలను సల్లంగా సూడు తల్లీ అంటూ అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు.

మేడారం మినీ జాతర ప్రారంభం.. వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తుల

భక్త సంద్రమైన మేడారం.. వనదేవతలను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.