ETV Bharat / state

Ghatkesar Child Kidnap Case : ఘట్​కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతం.. పోలీసులపై స్థానికుల ప్రశంసలు

author img

By

Published : Jul 6, 2023, 9:56 PM IST

Ghatkesar Kidnapping Case
Ghatkesar Kidnapping Case

Ghatkesar Child Kidnap Case Updates : కలకలం సృష్టించిన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి కథ సుఖాంతమైంది. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాప క్షేమంగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని కాపాడేందుకు పోలీసులతో పాటు స్థానిక యువకులు చేసిన సహాయానికి సీపీ సైతం వారిని అభినందించారు. పాపను కాపాడిన పోలీసులకు స్థానికులు సలాం చేశారు.

ఘట్ కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతం

Four Years Girl Kidnapping in Medchal : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో భరత్, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి ఉంది. భరత్ స్థానికంగా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కృష్ణవేణి ఇంటి ప్రక్కనే ఉన్న దుకాణానికి వెళ్లింది. అక్కడ తినుబండారాలు కొనుక్కుని ఎదురుగా ఉన్న మైదానంలో ఆడుకుంటుంది. కొద్దిసేపటి తరువాత బాలిక అక్కడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గాలించారు.

ఫలితం లేకపోవడంతో రాత్రి 9.30గంటల ప్రాంతంలో డయల్ 100కి కాల్ చేశారు. విషయం తెలుసుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు బాలిక ఇంటికి వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కోసం గాలించారు. ఘట్‌కేసర్‌ ప్రధాన రహదారి, రైల్వే ట్రాక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇదే క్రమంలో ఓ వ్యక్తి బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. స్థానికులను అడిగి ఆ వ్యక్తి సురేష్‌గా నిర్ధారించారు. అతను జగదాంబ సినిమా థియేటర్‌లో పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. బాలికను తీసుకెళ్లిన వ్యక్తి కోసం గాలించేందుకు ఘట్‌కేసర్‌లోని యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

సుమారు 200 మంది యువకులు రాత్రి మూడింటి వరకూ గాలించారు. యువకులు గాలించేందుకు రియాజ్‌ అనే స్థానికుడు సుమారు 50 ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి తన మానవత్వాన్ని చాటాడు. దీంతో బీబీనగర్‌, ఘట్‌కేసర్‌, ఏదులాబాద్ తదితర ప్రాంతాలు, సర్వీసు రోడ్డులు, వెంచర్లు మొత్తం యువకులు, పోలీసులు కలిసి గాలించారు. ఉదయం డాగ్‌ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగింది. స్థానికంగా ఉన్న గురుకుల పాఠశాల మైదానం, పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టారు. సురేష్ ఫోన్‌ నంబర్ కోసం ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్‌ఆఫ్ వచ్చింది.

గతంలోనూ నిందితుడు బాలురులను తీసుకెళ్లాడు : సురేష్‌ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా ఇటీవల తండ్రి కూడా మరణించాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన ఆయన.. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో కాలనీల్లో బాలురని తీసుకువెళ్లాడని స్థానికులు తెలిపారు. గత రాత్రి బాలిక ఇంటి సమీపంలోనే ఉన్నాడని.. బాలిక ఇంటి ముందు అతను తర్చాడాడని చెప్పారు. మరో వైపు పాపను క్షేమంగా తీసుకువచ్చేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. నిందితుడు రైల్వే స్టేషన్ వైపు వెళ్లాడని సీసీటీవీ ఫుటేజ్‌లో గమనించారు. ముందస్తుగా గుంటూరు, మిర్యాలగూడ, కాజీపేటకు బృందాలను పంపారు.

కొంతసేపు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్​లో ఉన్న సురేష్.. పాపను తీసుకుని యామ్నంపేట వద్దనున్న రైల్వే వంతెన వద్ద వరకూ నడుచుకుంటూ వెళ్లాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న నిందితుడు వంతెన వద్ద కొంత సేపు కూర్చున్నాడు. కొంత సేపటికి అక్కడికి వచ్చిన గూడ్స్ రైలు ఎక్కాడు. ఖాళీగా ఉన్న గూడ్స్ బోగిలో పాపను పడుకోబెట్టి అతను కూడా నిద్రించాడు. అర్ధరాత్రి మేలుకువ రావడంతో రైలు దిగిన సురేష్ కాజీపేటలో ఉన్నాడని అర్థం అయింది. అక్కడి నుంచి కాజీపేట బస్‌స్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్లి పాపతో సహా బస్‌స్టాండ్‌లో సురేష్‌ నిద్రించాడు.

Girl Kidnapping Case in Hyderabad : తెల్లవారుజామును మళ్లీ కాజీపేట్ రైల్వే స్టేషన్‌కు వచ్చి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైలులో ఎక్కి స్టేషన్‌లో దిగాడు. ప్లాట్‌ఫామ్ 1కు వచ్చి పాపను పక్కనే ఉంచుకుని మళ్లీ నిద్రించాడు. అప్పటికే ఘట్‌కేసర్‌ ఎస్సై అశోక్ తేజ.. నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, గుంటూరు జీఆర్‌పీ పోలీసులతో మాట్లాడి సురేష్‌తో పాటు పాప కృష్ణవేణి ఫోటోలను అందరికీ వాట్సాప్ చేశారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్ జీఆర్‌పీ కానిస్టేబుళ్లు వంశీ, నాగారాజు ప్రవీణ్‌లకు స్టేషన్‌లో పాప కనిపించింది. పాప ఫోటోలను పోలీసులు సరిగా గుర్తుపట్టలేక పోవడంతో తల్లిదండ్రలకు ఆ ఫోటోలను చూపి నిర్ధారించారు.

పోలీసులపై స్థానికుల ప్రశంసలు : వెంటనే జీఆర్‌పీ పోలీసులు నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పాపను ఘట్‌కేసర్‌ ఎస్సైకు అప్పగించారు. కేసును మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్ పాపను స్వయంగా ఎత్తుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి దొరకడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధుల్లేవు. స్థానికులు సైతం పోలీసులను మెచ్చుకున్నారు. పోలీస్ జిందాబాద్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. పాపను క్షేమంగా తల్లి ఒడికి చేర్చినందుకు సంతోషంతో పోలీసులకు మిఠాయిలను పంచిపెట్టారు. పాపను వెతికిపెట్టిన పోలీసులతో పాటు స్థానికులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.