ETV Bharat / state

KCR Medak District Tour : 'అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల.. రాష్ట్ర ప్రగతి గాడి తప్పే ప్రమాదం'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 4:13 PM IST

Updated : Aug 23, 2023, 9:13 PM IST

KCR opening SP office in Medak
KCR opening BRS office in Medak

CM KCR Inaugurate New Collectorate in Medak : స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి పథాన నిలిపిన ఘనత బీఆర్ఎస్‌దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల.. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతి గాడి తప్పే ప్రమాదముందని హెచ్చరించారు. నిరాటంకంగా పథకాలన్నీ సాగాలంటే.. గులాబీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లంటే.. కాంగ్రెస్‌ మూడు గంటల కరెంట్‌ చాలంటూ రైతులను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థికంగా మరింత కుదుటపడగానే పింఛన్లు పెంచుతామని కేసీఆర్ తెలిపారు.

KCR Medak District Tour రాబోయే రోజుల్లో పింఛన్లు మరింత పెంచేందుకు కృషిచేస్తాం

KCR Speech in BRS Meeting at Medak : మెదక్‌ ప్రగతి శంఖారావం సభ వేదికగా.. అభివృద్ధిని ప్రస్తావిస్తూనే విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR Medak Tour) చురకలు అంటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలిసారిగా అధికార బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం.. ప్రగతి శంఖారావాన్ని పూరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు తెచ్చుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని తెలిపారు. పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రగతి, సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించామని కేసీఆర్ వివరించారు.

KCR Fires on Congress and BJP :కేంద్రం సహకరించకపోయినా.. కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బందులు పడ్డా.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మోటర్లకు మీటర్లు పెట్టాలంటుంటే.. కాంగ్రెస్‌ నాయకులు సాగు రంగానికి మూడు గంటల కరెంట్‌ చాలని ప్రజలను ఏమార్చుతున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలను దూరంగా పెట్టాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తే.. మళ్లీ పైరవీకారుల చేతుల్లోకి భూములు పోతాయని కేసీఆర్ ఆక్షేపించారు. మెదక్‌ సభలో విపక్షాలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నమ్మకం బీఆర్ఎస్ పెట్టుబడి అయితే.. అమ్మకం ప్రతిపక్షాల నైజం అని ఆయన ఘాటుగా విమర్శించారు.

"తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని మెరుగుపరిచాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు తెచ్చుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు సరఫరా చేస్తున్నాం. బీజేపీ మోటర్లకు మీటర్లు పెట్టాలంటుంది. మాకు ఒక్క ఛాన్స్ అని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటుంది. ధరణి తీసేయాలన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేయాలి. రైతు బీమా సదుపాయం అమెరికాలో కూడా లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి

అంతకుముందు మెదక్‌లో కేసీఆర్ తొలుత బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. వికలాంగుల ఆసరా పింఛను రూ.4016 పెంపు కార్యక్రమాన్ని మెదక్‌లో సీఎం ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్‌లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం ప్రారంభించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాకముందు.. పరిపాలన చేతకాదని విమర్శించారని ఆయన గుర్తు చేశారు.

పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏ స్థాయిలో ఉందనేందుకు కొన్ని గీటురాళ్లు ఉంటాయని వివరించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని.. నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. దివ్యాంగుల పింఛన్లను రూ.4016కు పెంచుకున్నామని.. రాబోయే రోజుల్లో పింఛన్లు మరింత పెంచేందుకు కృషిచేస్తామని వివరించారు.

మెదక్ జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన కేసీఆర్‌కు పటాన్‌చెరు, గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు జననీరాజనాలు పలికారు.

KCR Nirmal Tour : 'ఎన్నికలు వస్తున్నందున ఇష్టారీతిన మాట్లాడుతున్నారు'

CM KCR Released BRS MLAs Candidate List : 'రాష్ట్ర ప్రగతిని కొనసాగించాలనేదే అజెండా'.. అక్టోబర్​ 16న వరంగల్​లో సింహగర్జన సభ

Last Updated :Aug 23, 2023, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.