ETV Bharat / state

చదువుల తల్లి విజయలక్ష్మి విజయగాథ మీకు తెలుసా..?

author img

By

Published : Mar 8, 2023, 10:47 AM IST

Vijayalakshmi with children
పిల్లలతో విజయలక్ష్మి

Vijayalakshmi inspiring story in Mahabubnagar: ఆడపిల్లలకు చదువెందుకు ఆపేద్దామన్నాడు భర్త.. ముగ్గురూ ఆడపిల్లలు కావడంతో మగసంతానం కావాలంటూ.. కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కానీ.. చదువంటే ఆమెకు ఇష్టం. తాను చదువుకోలేకపోయినా, పిల్లల్ని చదవించాలనుకుంది. భర్త వదిలేసినా, పట్టువదల్లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని.. రేయింబవళ్లూ శ్రమించింది. నెలకు వెయ్యితో మొదలైన సంపాదనను.. నేడు 2లక్షలకు చేర్చింది. ముగ్గురు ఆడపిలల్ని ఉన్నత చదువులు చదివించి.. జీవితంలో స్థిరపడేలా చేసింది. తనకాళ్ల మీద తాను నిలబడటంతో పాటు.. పదిమందికీ ఉపాధి కల్పిస్తూ.. మహిళాలోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహబూబ్​నగర్‌కు చెందిన విజయలక్ష్మిపై మహిళాదినోత్సవం వేళ ప్రత్యేక కథనం.

పిల్లల కోసం కష్టపడి చదివించిన విజయలక్ష్మి

Vijayalakshmi inspiring story in Mahabubnagar : ఆడపిల్లంటే సమాజంలో అదోరకమైన చులకన భావం. కాలం, సమాజం మారుతున్నా వారిపట్ల వివక్ష పోవడం లేదు. అమ్మాయిలకు చదువెందుకు, ఉద్యోగాలెందుకు, మగాళ్లు లేకుండా మహిళలు ఏం సాధించగలరనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది. మహబూబ్ నగర్‌కి చెందిన విజయలక్ష్మి భర్త సైతం అలాగే ఆలోచించారు. వారికి ముగ్గురూ ఆడపిల్లలు. మొదటి ఇద్దరు చదువుకుంటున్నప్పుడే వాళ్లకు చదువులెందుకంటూ వాదించేవాడు. మూడో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో, మగసంతానం కోసం రెండోపెళ్లి చేసుకుంటానని విజయలక్ష్మిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కాని ఆమె అంగీకరించలేదు. దీంతో కట్టుకున్న భార్యను, కన్నబిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయాడు.

ఇడ్లీ టు ఆలు చిప్స్ వరకు: భర్త వెళ్లిపోయాడని విజయలక్ష్మి ఏ మాత్రం జంకలేదు. ఆడపిల్లల్ని చదవించి తీరాలనే పట్టుదలలో అహర్నిశలూ శ్రమించారు. పెళ్లైన కొత్తలో టైలరింగ్ చేసిన ఈమె, మూడో కాన్పు శస్త్రచికిత్స కావడంతో.. టైలరింగ్ వదిలి ఇడ్లీల వ్యాపారం మొదలుపెట్టారు. దీంతో కాస్త ఆదాయం పెరిగింది. ఆ తర్వాత కారా, బూందీ, మిక్చర్ లాంటివి తయారు చేసి అమ్మేవారు. వాటిని భర్త అమ్ముకుని వచ్చేవాడు. భర్త వదిలి వెళ్లిపోయాక ఆలోచనలో పడ్డారు. ఆలూ చిప్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు.

స్టార్టప్​ ఇండియా పథకం సహాయం: కిలో నుంచి రోజుకు 300 కిలోల చిప్స్‌ తయారు చేసేంతగా వ్యాపారాన్ని విజయలక్ష్మి పెంచారు. ఆ తర్వాత 'స్టార్టప్ ఇండియా' పథకం కింద కేంద్రం రాయితీ రుణం 22లక్షలతో జిల్లాలోని పోల్కంపల్లిలో ఆలూ చిప్స్ పరిశ్రమ నెలకొల్పారు. ఏటా 50-60 లక్షల విలువైన వ్యాపారం చేస్తున్న విజయలక్ష్మీ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలన్నది కోరిక అని చెప్పారు.

పిల్లలు ఎదుగుదల.. వారి ప్రస్తుత జీవితం: అహర్నిశలూ శ్రమించింది.. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్న పట్టుదలతో విజయలక్ష్మి ఉన్నారని తెలిపారు. పెద్దకుమార్తె వైద్యురాలిగా స్థిరపడగా, రెండో అమ్మాయి.. ఫోరెన్సిక్ సైన్స్ చదివి ఆస్ట్రేలియాలో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో కుమార్తె పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పిల్లల చదువులే తనకు అలంకారం, ఆస్తి అని ఆమె చెప్పారు.

మహిళలకు అండగా నేను ఉంటా: విజయలక్ష్మి ఎవరి తోడు లేని మహిళలు ఏదైనా రంగంలో రాణించాలని భావిస్తే అండగా నిలిచేందుకు తాను సిద్ధమేనని విజయలక్ష్మి చెబుతున్నారు. ఆడపిల్లని కొందరు పురిట్లోనే వదిలించుకుంటే కొందరు పుట్టాక వదిలేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, భర్త, సమాజం వెలేసిందని మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

"టైలరింగ్​ చేసినప్పుడు నెలకు రూ.1000-1100 వచ్చేది. ఇడ్లీ వ్యాపారం చేసినప్పుడు సుమారు నెలకు రూ.9000 వచ్చేది. చిప్స్​ వ్యాపారంకి వచ్చే సరికి సుమారు నెలకు లక్ష వస్తోంది. నేను ఎంత కష్టపడినా ప్రతి రోజూ ముగ్గురు పిల్లలతో మాట్లాడి పడుకుంటాను. నాలాగా ఎవరు తోడులేని మహిళలకు నేను అండగా ఉంటాను. ఆడపిల్ల నీతిగా, నిజాయితీగా ఉంటే ఏమైనా సాధించగలదని నా నమ్మకం."- విజయలక్ష్మి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.