ETV Bharat / state

Kalwakurthy lift irrigation project : కానరాని నిర్వహణ.. రైతుల్లో ఆందోళన.. ప్రశ్నార్థకంగా 'కల్వకుర్తి ప్రాజెక్టు'

author img

By

Published : Aug 2, 2023, 2:13 PM IST

Kalwakurthy lift irrigation project
Kalwakurthy lift irrigation project

Kalwakurthy lift irrigation project Problems in Mahbubnagar : పట్టించుకునే నాథుడు లేక సుమారు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు ముప్పు బారిన పడుతోంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన చెట్లు జలాశయం కట్టను బలహీన పరుస్తున్నాయి. ప్రధాన, ఉప కాలువల తూములకు షట్టర్లు లేక సాగునీరు లీకౌవుతోంది. ఓ వైపు నీరు వృధాగా పోతుండగా మరోవైపు పంట కాల్వలు లేక చివరి ఆయకట్టుకు సాగునీరందట్లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్వహణపై ఈటీవీ భారత్ కథనం.

ప్రశ్నార్థకంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్వహణ

Kalwakurthy lift irrigation project Problems in Mahbubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా రెండో దశలో భాగమైన జొన్నలబొగుడ జలాశయం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. రూ.49 కోట్లలతో జలాశయాన్ని నిర్మించగా 2015 నుంచి నిర్వహణ బాధ్యతను గుత్తేదారు ప్రభుత్వానికి అప్పగించారు.

అప్పటి నుంచి నిర్వహణ సరిగా ఉండట్లేదు. జలాశయం రివిట్‌మెంట్, సపోర్టుగా ఉన్న సిమెంట్‌ పిల్లర్ల మధ్య వేప, మోదుగు, జిల్లేడు లాంటి చెట్లు పెరిగాయి. మట్టికట్టపై కంప చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తూ వెళ్లేందుకు దారి లేకుండా పోతోంది. దీంతో కట్ట మనుగడపై రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నల బొగుడ నుంచి గుడిపల్లిగట్టు జలాశయానికి నీరు విడుదల చేసే తూము తలుపులు దెబ్బతిని సాగునీరు వృధాగా పోతోంది. 3 తూములు ఏర్పాటు చేయగా మొదటి తూము షట్టర్ ఇరుక్కుపోయింది. 4 నెలల కిందట మరమ్మతులు చేపట్టినా లీకేజీలను అరికట్ట లేకపోయారు.

షట్టర్ల మరమ్మతుకు అవసరమైన యంత్రాలు, నిధుల లేమితో లీకేజీని అరికట్టడం కష్టంగా మారుతోంది. ఉన్న కొద్దిపాటి నీళ్లు సైతం లీకేజీల ద్వారా వృధాగా పోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలు ఉన్నంత వరకైనా సాగునీరు అందుతుందా అంటే అదీ లేదు. తూముల లీకేజీలతో నీళ్లు విడుదల చేసినప్పుడు మొదటి ఆయకట్టు రైతుల పొలాల్లోకి నీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయి. లీకేజీలతో సాగునీరు అధికమైన చోట జమ్ము మొలిచి రైతులు పొలాల్ని సాగుచేయడమే వదిలేశారు.

పసుపుల-పానగల్ బ్రాంచి కాల్వ, పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ జలశయానికి ఉన్న రిడ్జ్ కెనాల్, లింగాల, నాగర్ కర్నూల్, తాడురు, తెలకపల్లి మండలాల్లో కొన్ని కాల్వల కింద అధికంగా జమ్ము పెరగడంతో రైతులు పొలాలను సాగు చేయకుండా వదిలేశారు. మరోవైపు లీకేజీల వల్ల చివరి ఆయకట్టుకు సాగునీరందట్లేదు. ప్రధాన, ఉప కాల్వలకు అనుసంధానంగా పంట కాల్వలు నిర్మించాల్సి ఉంది. ఐదేళ్ల కింద కోడెరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో పిల్లకాల్వల కోసం సర్వే చేసినా ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదు.

"జలాశయం చుట్టూ అనేక చెట్లు ఉన్నాయి. వాటి వేర్లు కట్టకు ఇరువైపుల లోతుగా వెళ్లిపోయాయి. దాని వలన డ్యాం నాణ్యత తగ్గి.. కట్ట కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టును గాలికొదిలేశారు. కాలువలను శుభ్రం చేసి వాటిలో పూడికలను తీయాలి. ప్రాజెక్టు రోడ్డు నిర్మాణం సరిగ్గా లేదు." - రవి, స్థానికుడు

Telangana irrigation projects : దీంతో పొలాలకు నీరు మళ్లించుకునేందుకు కొందరు రైతలు పైపులైన్లు వేస్తుండగా మరికొందరు సొంతడబ్బుతో పంట కాల్వలు నిర్మించుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లిస్తేనే కాల్వలకు షట్టర్లు, పంట కాల్వల నిర్మాణ పనులు చేస్తామని గుత్తేదారులు అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.