మిల్లుల వద్దకు ధాన్యాన్ని తీసుకొచ్చి నాలుగురోజులు గడుస్తున్నా.. మిల్లర్లు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ రైస్ మిల్లు వద్ద అన్నదాతలు ఆందోళనకు చేపట్టారు.
లారీలు రాకపోతే తామే మిల్లుల వద్దకు ధాన్యం తీసుకువస్తున్నా.. మిల్లర్లు మాత్రం దింపుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహకులు ఇచ్చిన టోకన్ల ప్రకారమే పంటను మిల్లుల వద్దకు తీసుకువస్తే సామర్థ్యానికి మించి ధాన్యాన్ని తీసుకున్నామని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు తూకం, నాణ్యతలో తేడాల పేరిట మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. బస్తాకు రెండు కేజీల వరకు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే మూడు, నాలుగు రోజులు కావడంతో ట్రాక్టర్ల అద్దె మరింత భారంగా మారుతోందన్నారు. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు ఎండ తీవ్రతతో మంచినీళ్లు, ఆహారం కూడా దొరకడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన రాచకొండ సీపీ