ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో 'రియల్‌' దందా.. నకిలీ పట్టాలతో గుట్టుచప్పుడు కాకుండా..!

author img

By

Published : Jun 23, 2022, 3:38 PM IST

నిరుపేదలకు అప్పగించిన ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు.. అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇళ్లు కట్టుకోకపోవటంతో.. ఆ ఖాళీ స్థలాలపై దళారీల కన్నుపడింది. ప్రభుత్వ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి.. రూ.కోట్ల దందాకు తెరలేపారు. ఒక్కో ప్లాటు ఏకంగా ఇద్దరు, ముగ్గురికి కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ మండలంలో నకిలీ పట్టాల దందా వ్యవహారం.. అసలు లబ్ధిదారుల్లో గుబులు పుట్టిస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో 'రియల్‌' దందా.. నకిలీ పట్టాలతో రూ.కోట్లలో..!
ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో 'రియల్‌' దందా.. నకిలీ పట్టాలతో రూ.కోట్లలో..!

ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో 'రియల్‌' దందా.. నకిలీ పట్టాలతో రూ.కోట్లలో..!

ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం రెవెన్యూ పెద్ద తండా పంచాయతీలోని ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో రియల్‌ఎస్టేట్‌ దందా నడుస్తోంది. సర్వే నెంబర్ 142లోని ప్లాట్లను.. ఇళ్లు లేని నిరుపేదలకు 2008లో ప్రభుత్వం కేటాయించింది. ఎంపిక చేసిన 620 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి 72 గజాల చొప్పున కేటాయించారు. ఇందులో 100 నుచి 120 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. మిగతావి ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. సర్వే నంబర్ చుట్టూ ఉన్న ప్రైవేటు భూముల విలువ ఎకరాకు రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లపై స్థానికంగా కొందరి కన్నుపడింది. ఖాళీగా ఉన్నవి విక్రయించేందుకు రంగంలోకి దిగిన దళారీలు.. నకిలీ పట్టాలు సృష్టించి రూ.కోట్ల దందాకు తెరలేపారు.

అడిగితే బెదిరిస్తారు.. ఆ తర్వాత..: లబ్ధిదారులు తమ స్థలంలో ఎప్పుడైనా ఇళ్లు కట్టుకోవచ్చని.. లేదా అమ్ముకోవచ్చనే ధీమాతో ఉన్నారు. ఇళ్ల స్థలాలు పొందిన వారిలో కొంతమంది స్థానికంగా లేకపోవడం, కొన్ని ప్లాట్ల నంబర్లు మార్పులు జరగటంతో.. ఏ ప్లాటు ఎక్కడ ఉందో లబ్ధిదారులకు తెలియక గందరగోళం ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారీలు.. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే.. ముందుగా స్థల యజమానిని బెదిరిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్​స్టేషన్‌కి వెళితే.. ఎంతో కొంత ముట్టజెప్పి విషయం బయటకు రాకుండా చేస్తున్నారు.

స్థానిక రాజకీయ నాయకులే పాత్రధారులు..!: ఇందిరమ్మ ప్లాట్లలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేసుకోవాలి తప్ప... క్రయ విక్రయాలు జరపకూడదు. కానీ, ఈ ప్లాట్ల దందా దళారీలకు కాసులు కురిపిస్తోంది. ఖాళీ ప్లాట్లను గుర్తించడం, వాటికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించడం ద్వారా రూ.కోట్లు కూడబెడుతున్నారు. ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురికి అమ్ముతున్నారు. ఈ దందాలో.. గతంలో పనిచేసిన అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అధికారుల దృష్టిలో ఉన్నా.. పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొంతమంది స్థానిక రాజకీయ నాయకులే పాత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సమస్యపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. మరోవైపు నకిలీ పట్టాలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇవీ చూడండి..

ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలం

సూపర్ టేస్టీ, హెల్దీ పెసరట్టు.. సింపుల్​గా తయారు చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.