ETV Bharat / state

Khammam Congress Meeting : ఖమ్మం 'జనగర్జన సభ'కు సర్వసిద్ధం.. హాజరుకానున్న రాహుల్​గాంధీ

author img

By

Published : Jul 2, 2023, 7:07 AM IST

Updated : Jul 2, 2023, 7:18 AM IST

Congress
Congress

Congress Meeting at Khammam : ఖమ్మం గడ్డపై జన గర్జనకు కాంగ్రెస్ సర్వసన్నద్ధమైంది. ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను... పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభ ద్వారా.. రాష్ట్ర కాంగ్రెస్​లో కొత్త శకం మొదలవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం గడ్డపై ఇవాళ జన గర్జన భారీ సభకు కాంగ్రెస్‌ సర్వసన్నద్ధం

Congress Public Meeting at Khammam Today : రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఎటుచూసినా నగరం చుట్టూరా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో కాంగ్రెస్‌లో సరికొత్త సందడి సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ... భారీగా జనసమీకరణతో సత్తా చాటాలని యోచిస్తోంది. ఖమ్మంలోని ఎస్​ఆర్ గార్డెన్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

Rahul Gandhi attends Khammam Meeting Today : ఆదివారం మధ్యాహ్నం తర్వాత దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. బహిరంగ సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి సభలో పాల్గొంటారు. సభలో తొలుత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారు. పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా... భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ సన్మానించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ముఖ్యనేతలు హస్తం గూటికి చేరనున్నారు. వీరితోపాటు పొంగులేటి ముఖ్య అనుచరులు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 80 మంది ఉన్నారు.

కనీవినీ ఎరగని రీతిలో జనగర్జన సభకు ఏర్పాట్లు : ఇక బహిరంగ సభకు కాంగ్రెస్ కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేలాది మందిని బహిరంగ సభకు తరలించేలా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీగా కార్యకర్తల్ని తరలించేలా సన్నాహాలు చేశారు. పొరుగునే ఉన్న జిల్లాల్లోని పలు నియోజకవర్గాల నుంచీ కార్యకర్తలను తరలిస్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా కార్యకర్తలను తరలించేలా క్షేత్రస్థాయిలో నాయకులకు బాధ్యతలు అప్పగించారు. సభా వేదిక, బహిరంగ సభ స్థలి మొత్తం కలిపి దాదాపు 40 ఎకరాల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎల్ఈడీ తెరను సభా వేదిక వెనుక భాగంలో రూపొందించారు. సభా వేదికకు ఇరు వైపులా భారీ ఎల్​ఈడీ తెరలతో ముఖ్య నేతల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.

60 ఎకరాల్లో పార్కింగ్ కేంద్రాలు : సభా ప్రాంగణం చుట్టూరా 15 ఎల్​ఈడీ తెరలు అమర్చుతున్నారు. దాదాపు 200 మంది కూర్చునేలా సభా వేదికను తీర్చిదిద్దారు. సభా వేదిక ఎదురుగా ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీని కేటాయించారు. మహిళలకు సభా వేదిక సమీపంలో గ్యాలరీలు కేటాయించారు. ఇక పార్కింగ్ వ్యవస్థలో లోటుపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించారు. సభా వేదిక సమీపంలోనే దాదాపు 60 ఎకరాల్లో పలుచోట్ల పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా పార్కింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించి తమకు కేటాయించిన కేంద్రాల్లోనే వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాలరీల్లో కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు.

బీఆర్​ఎస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది : కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి తట్టుకోలేక అధికార బీఆర్​ఎస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సభను విఫలం చేయాలని బీఆర్​ఎస్ అనుకుంటోందని.. కానీ జనగర్జనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. అటు.. బహిరంగ సభకు అడ్డంకులు సృష్టించడంతోపాటు తన ప్రధాన అనుచరుడు మువ్వా విజయ్ బాబును చంపేస్తామంటున్నారన్న పొంగులేటి ఆరోపణలపై భారత్​ రాష్ట్ర సమితి స్పందించింది.

వ్యక్తి స్వేచ్ఛను హరించే చర్యలు బీఆర్​ఎస్ చేయబోదని బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతామధుసూదన్ అన్నారు. బహిరంగ సభ విజయవంతం కాదన్న బెంగతోనే పొంగులేటి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. పొంగులేటి అనుచరుడు మువ్వావిజయ్ బాబును హత్య చేస్తామంటూ పోస్టర్లు వెలవడంపై పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ స్పందించారు. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు పోలీసుల విచారణలో లభించలేదన్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 2, 2023, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.