'ప్రభుత్వాన్ని, పార్టీని అప్రదిష్ఠపాలు చేసేందుకే నాపై ఆరోపణలు'

author img

By

Published : Nov 18, 2020, 7:02 PM IST

Updated : Nov 18, 2020, 7:43 PM IST

former-minister-tummala-nageswara-rao-press-meet

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నారని గతకొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోన్న వార్తలపై ఆయన స్పందించారు. కొంతమంది కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కలిశారు.

former-minister-tummala-nageswara-rao-press-meet
సీపీ తఫ్సీర్ ఇక్బాల్​కు ఫిర్యాదు చేస్తున్న తుమ్మల

తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్​ని కలిశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరులో తనను ఓడించిన వారే.. ప్రస్తుతం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ అసాధారణ రీతిలో గౌరవించారు...

ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు చిరకాల మిత్రుడని తుమ్మల తెలిపారు. అసాధారణ రీతిలో గౌరవించారని వ్యాఖ్యానించారు. ఓడిపోయినా మంత్రిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. సీఎం సహకారంతో జిల్లాకు రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కావాలనే తనపై కొందరు అక్కసు వెళ్ల గక్కుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

former-minister-tummala-nageswara-rao-press-meet
నాడు ఓడించి... నేడు దుష్ప్రచారం: తుమ్మల

ప్రభుత్వాన్ని, పార్టీని అభాసుపాలు చేయడానికే...

వ్యక్తిగత లబ్ధికోసం తానెప్పుడూ పాకులాడలేదని తుమ్మల అన్నారు. వేరేపార్టీకి వెళ్లాల్సిన గతి తనకు పట్టలేదని చెప్పారు. పార్టీని భ్రష్టు పట్టించడానికి, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికే.. కొందరు ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కలిసొచ్చో.. అర్ధంతరంగానో.. అదృష్టవశాత్తో.. రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందిన కొందరు ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పదవులను ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికారు.

తాను గెలిచినా, ఓడినా ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పదవుల కోసం, వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ తాపత్రయ పడలేదని చెప్పారు. జీహెచ్​ఎంసీతోపాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తెరాసదే విజయమని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రాజకీయాలు చేసినా.. కేసీఆర్​ను చూసి ప్రజలు ఓట్లేస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: కోర్టుకు రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

Last Updated :Nov 18, 2020, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.