ETV Bharat / state

కరెంట్​ కోతలు.. రైతన్నకు తప్పని వెతలు

author img

By

Published : Feb 12, 2023, 12:14 PM IST

వేసవి కాలం ముంగిట్లోకి వస్తుండటంతో కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో పొలాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గంటకోసారి కోత పెట్టకుండా తమ పంటలు కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంటోంది.

కరెంట్​కోసం రైతుల ధర్నా
కరెంట్​కోసం రైతుల ధర్నా

ఏకధాటిగా విద్యుత్‌ ఇవ్వకపోవడంతో వచ్చే కరెంటుతో తడిసిన పొలాలే మళ్లీ తడుస్తున్నాయి తప్ప.. పంటలకు నీళ్లు అందడం లేదు. యాసంగి సీజన్‌లో పొలాలు ఎండిపోతున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు కరెంట్ ఇవ్వడంతో పొలాల దగ్గరే రైతులు 24 గంటలూ పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారులు ఒక్కో ఊర్లో ఒక్కో సమయంలో కరెంట్ ఇస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో 99 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో ఒక లక్ష 33 వేలకు పైగా, జగిత్యాలలో 72 వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 73 వేలకు పైగా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 లక్షల 79 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల రాత్రి పూట ఇవ్వడం, మరికొన్ని చోట్ల పగటి పూట ఇవ్వడంతో పొలాలకు సరిగా నీరు అందడం లేదు. పొలాల దగ్గర ఉన్న కరెంట్ మీటర్ల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నారు. 24 గంటల కరెంట్ ఏమో కానీ ఐదారు గంటల కరెంట్ సరిగా ఉండటం లేదని వాపోతున్నారు.

జగిత్యాల జిల్లాలో నాలుగున్నర నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుంది. అయితే కరెంట్ కోతలు, పొలాలకు చీడ పురుగుల బెడదతో దిగుబడి తక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. కనీసం ఉన్న పంటనైనా కాపాడుకోవాలంటే నిరంతరంగా కరెంట్ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే చీడపీడల కారణంగా నష్టపోతున్నామని.. తాజాగా కరెంటు కోతలతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్​కోతలు.. రైతన్న వెతలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.