బీజేపీకి మత పిచ్చి తప్ప ఏం తెలీదు - ప్రజలు అభ్యర్థుల గుణగణాలు విచారించి ఓటు వేయాలి : సీఎం కేసీఆర్

బీజేపీకి మత పిచ్చి తప్ప ఏం తెలీదు - ప్రజలు అభ్యర్థుల గుణగణాలు విచారించి ఓటు వేయాలి : సీఎం కేసీఆర్
CM KCR Speech at Karimnagar Praja Ashirvada Sabha : బీజేపీకి మత పిచ్చి తప్ప ఏం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. దేశంలో 157 వైద్య కళాశాలలను కేంద్రం పెట్టిందని.. అందులో ఒక్కటి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కేంద్రం ఇవ్వకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
CM KCR Speech at Karimnagar Praja Ashirvada Sabha : 58 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)ఆరోపించారు. కరీంనగర్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. రూ.3.18 లక్షలతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వివరించారు.
BRS Public Meeting in Karimnagar : తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో 19వ స్థానంలో ఉన్నామన్న కేసీఆర్.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అనుకున్నంత స్థాయిలో పరిణితి రాలేదని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. ప్రజల దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని చెప్పారు. అభ్యర్థుల గుణగణాలు ప్రజలు విచారించి ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసమేనని స్పష్టం చేశరు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి, కరెంట్ కష్టాలు ఉండేవని ఆరోపించారు.
BRS Election Campaign in Telangana : తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్సేనని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969లో ఉద్యమకారులను కాంగ్రెస్ పిట్టల్లా కాల్చి చంపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను ఉండేదన్నారు. దేశ చరిత్రలో వందల్లో ఉన్న పింఛన్ను వేలల్లోకి పెంచామని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ప్రజలను ముఖ్యమంత్రి అడిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు.
CM KCR Fires on Rahul Gandhi : సాగునీటిపై గతంలో పన్ను ఉండేదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రద్దు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ధరణి ద్వారా దళారులు లేకుండా పోయారని పేర్కొన్నారు. ధరణి ఉండటం వల్ల రైతులు గడపదాటకుండా ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అని రాహుల్ అంటున్నారని ధ్వజమెత్తారు. ధరణి తీసేస్తే రైతుబీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని సీఎం ప్రశ్నించారు. పంజాబ్ను అధిగమించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR Comments on Congress and BJP : ధరణి తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్(Telangana Congress) చూస్తోందని సీఎం ఆరోపించారు. లోయర్ మానేరు డ్యామ్ గతంలో ఎలా ఉండేదన్న ఆయన.. డ్యామ్ ఉన్నా తాగేందుకు నీళ్లు ఉండేవి కావని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎల్ఎండీకి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని వివరించారు. దేశంలో 157 వైద్య కళాశాలలను కేంద్రం పెట్టిందని.. అందులో ఒక్కటి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కేంద్రం ఇవ్వకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. చట్టం ఉన్నా తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకు ఎందుకు ఓటేయాలి సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
