ETV Bharat / state

Alampur Wine Shops: వివాదాలకు కేంద్రంగా అలంపూర్‌ మద్యం దుకాణాలు..

author img

By

Published : Dec 1, 2021, 4:14 AM IST

Alampur Wine Shops
Alampur Wine Shops

Wine Shops: రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే ఆ దుకాణాలు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఆదాయం అధికంగా ఉండటంతో.. టెండర్లు దక్కించుకున్నవారికి ... ఎంతో కొంత ముట్టజెప్పి లీజుకు తీసుకోవాలని రాయలసీమ వ్యాపారులు పావులు కదువుతున్నారు. మరోవైపు మద్యం దుకాణాలనే అక్కన్నుంచి తొలగించాలని... స్థానికులు, విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ఇంతకీ ఈ మద్యం దుకాణాలు ఎక్కడున్నాయి... ఎందుకింత హాట్ టాపిక్​గా మారాయో తెలుసుకుందాం...

Wine Shops : రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయమున్న మద్యం దుకాణాల్లో... జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మద్యం దుకాణాలు ఒకటి. గతంలో అక్కడ రెండు దుకాణాలుండగా.. ఈసారి నాలుగు దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో మద్యానికి భారీ డిమాండ్ ఉంటుంది. కారణం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్​లో అన్నిబ్రాండ్​ల మద్యం లభించదు. ధరలూ అధికమే. అక్రమంగా సరిహద్దులు దాటడంతో పాటు కొనుగోళ్లు ఎక్కువే. అందుకే ఆ దుకాణాలపై రాయలసీమ వ్యాపారుల కన్నుపడింది. నిబంధల ప్రకారం ఆబ్కారీశాఖకు నిర్ణీత రుసుం చెల్లించి ఆయా దుకాణాల్లో ఎవరైనా భాగస్వాములుగా చేరొచ్చు. ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని వాటిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సీమ వ్యాపారులు. ఇప్పుడున్న రెండు దుకాణాలు.. అలంపూర్ చౌరస్తాలో ఉన్నాయి. టోల్ గేట్ దాటి పుల్లూర్ వైపు.. పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద మరో రెండు దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు సీమ వ్యాపారులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన..

ఓవైపు ఎలాగైనా దుకాణాలు దక్కించుకోవాలని వ్యాపారులు ప్రయత్నం చేస్తుంటే.. అసలు మద్యం దుకాణాలే వద్దంటూ స్థానికులు, విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. అలంపూర్ చౌరస్తాలో అలంపూర్ వెళ్లేమార్గంలో ఒకటి.. కర్నూల్ వెళ్లే మార్గంలో మరో దుకాణం ఉన్నాయి. వారాంతాలు, సెలవుదినాల్లో ఈ రెండు ప్రాంతాలు జాతరను తలపిస్తాయి. ఏపీ నుంచి జనం విపరీతంగా వస్తారు. బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తారు. వీటికి దగ్గర్లోనే ప్రైవేటు పాఠశాల, కళాశాలలున్నాయి. విద్యార్థులకు మద్యం ప్రియులతో.. ఇబ్బంది తప్పడం లేదు. జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి వచ్చి పోయే భక్తులు, ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన స్థానికులు, రైతులు, కూలీలు అదే మార్గంలో వెళ్లాలి. కానీ చౌరస్తా అంతటా మందుబాబులతో నిండి ఉండటం సామాన్య జనానికి ఇబ్బందిగా మారుతోంది.

రెండేళ్లలో 10మంది మృతి..

మద్యం దుకాణాల కారణంగా అలంపూర్ చౌరస్తా నేరాలకూ అడ్డాగా మారుతోంది. 2 నెలల కిందట కర్నూలుకు చెందిన ముగ్గురు వ్యక్తులు పూటుగా మద్యం తాగి ఘర్షణకు దిగి ఓ వ్యక్తిపై దాడి చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందారు. ఇటీవల కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అలంపూర్ చౌరస్తాలో.. మద్యం తాగుతూ అక్కడే పరిచయమైన కర్నూలుకు చెందిన ఆటోడ్రైవరుతో కలిసి.. తిరుగు పయనం అయ్యారు. ఆటోడ్రైవరు దారి మళ్లించి ప్రొద్దటూరుకు చెందిన వ్యక్తిని చంపుతానని బెదిరించి 2లక్షల విలువైన ఆభరణాలు, ఫోన్ దొంగలించాడు. మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రెండేళ్లలో పదిమంది వరకూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెంది ఉంటారని అంచనా. ఇప్పటికే ఎమ్మెల్యే అబ్రహాంకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు మద్యం దుకాణాలు తొలగించకపోతే మరోసారి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆదాయం కోసం మద్యం దుకాణాలను ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందా.. జనం గోడు విని అక్కన్నుంచి వాటిని తరలించి.. నేరాలకు అడ్డుకట్ట వేస్తుందా జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశమవుతున్న మద్యం దుకాణాలపై... జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: గ్రామస్థుల గుండెల్లో గుబులు రేపుతోన్న క్వారీ పేలుళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.