ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ ఘటన - 'ఆ మూడు పియర్స్ కుంగుబాటుతో ఆనకట్ట మొత్తం కదిలింది'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 12:34 PM IST

Etv Bharat
Etv Bharat

Medigadda Barrage Issue Latest Update : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైనప్పుడే చర్యలు ఎందుకు చేపట్టలేదని కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వాన్ని నిలదీశారు. బ్యారేజీలో చోటుచేసుకున్న లోపాలే ఇప్పుడు శాపాలుగా మారాయని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ఏడో బ్లాకులో పియర్ కుంగుబాటు ప్రభావం ఇతర బ్లాకులపైనా పడిందని, ఇది ఆనకట్ట మొత్తాన్ని కదిలించిందని చెప్పారు. పలు పియర్స్‌పై నెర్రెలు ఏర్పడ్డాయని, ఇనుప బీమ్‌లకు పగుళ్లు వచ్చాయని చెప్పారు. శుక్రవారం రోజున మంత్రులు మేడిగడ్డను సందర్శించిన అనంతరం లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

Medigadda Barrage Issue Latest Update : తెలంగాణలో గత కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలో పలు బ్యారేజీల్లో చోటుచేసుకున్న ఘటనలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశం సంచలనం సృష్టించింది. మేడిగడ్డలోని ఏడో బ్లాకులో 20వ పియర్‌తో పాటు 19, 21 పియర్స్ కుంగాయి. వీటి ప్రభావం ఆనకట్ట మొత్తాన్ని కదిలించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిపోతుంది.

ముఖ్యంగా ఏడో బ్లాకు సమీపంలో ఉండే ఆరో బ్లాకులోని పలు పియర్స్‌పై ఉన్న ఇనుప దిమ్మెలు (గాంట్రీ ట్రాక్‌ గిర్డర్‌) కదిలిపోయాయి. ఇనుప దిమ్మెలను అనుసంధానం చేసేందుకు వేసిన జాయింట్లు కూడా చాలా చోట్ల విరిగిపోయాయి. అక్టోబరు 21వ తేదీన బ్యారేజీ కుంగుబాటుకు గురైతే 24వ తేదీ నాటికి పగుళ్లు కాస్త పెరిగాయి. అయితే అక్కడితో కుంగుబాటు ఆగిందని నీటి పారుదల శాఖ చెబుతోంది.

Medigadda Barrage Damage Latest News : ఏడో బ్లాకులో చోటుచేసుకున్న కుంగుబాటును శోధించేందు కోసం బ్యారేజీకి ఎగువన కాఫర్‌ డ్యాం నిర్మాణానికి పనులు షురూ చేశారు అధికారులు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లి సమీపంలో గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నదిలో వాహనాల రాకపోకలకు వీలుగా మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీని 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాకులో 11 క్రెస్టు గేట్లు ఉండగా, ఏడో బ్లాకులోని రెండు గేట్లకు ఇరువైపులా ఉండే పియర్స్‌కు పగుళ్లు ఏర్పడి గ్యాప్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం సమీప బ్లాకులపైనా ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కష్టమేనంటున్న ఇంజినీరింగ్ అధికారులు

నిశితంగా పరిశీలిస్తే ఆరో బ్లాకుపై పలు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. 19, 20, 21 పియర్స్‌పై ఉండే ఇనుప బీమ్‌లు కిందికి దిగడంతో వాటి మధ్య ఉండే జాయింట్లు పగిలిపోయాయని , 2, 23, 24 పియర్స్‌పైన ఉన్న బీమ్‌ల జాయింట్లు కూడా పగుళ్లు వచ్చి ఒరిగిపోయాయని వెల్లడించారు. పియర్స్‌ అన్నీ ఒకే ఎత్తులో ఉన్నప్పుడు ఇనుప బీమ్స్‌ కూడా సమాంతరంగా ఉంటాయని పియర్స్‌ భూమిలోకి దిగిపోయిన చోట బీమ్స్‌ కూడా కిందికి జరగడంతో జాయింట్లు పగిలిపోయి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి ఏడో బ్లాకు ఒక్కటే కాకుండా సమీప బ్లాకుల్లో వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు.

Cause Of Medigadda Barrage Damage : పియర్స్‌ కుంగడంతో మూడు క్రెస్టు గేట్లను మార్చాల్సి వస్తుందని ఈఎన్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన వించ్‌, యాక్సెస్‌ లాడర్‌, వాక్‌ వే- 1, వాక్‌ వే-2, గేట్లను తెరిచేందుకు, మూసేందుకు ఉపయోగించే ప్రత్యేక పరికరం నడిచే గాంట్రీ వాక్‌ గిర్డర్‌ బీమ్‌లను పూర్తిగా మార్చనున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం రోజున బ్యారేజీని కాంగ్రెస్ మంత్రులు పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యారేజీ లోపాలు చర్చగా మారాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రులు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ వారు ప్రస్తావించిన అంశాలేంటంటే?

మేడిగడ్డ, అన్నారం పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో

ఆనకట్ట ఎగువ, దిగువ స్ట్రీం కట్‌ ఆఫ్‌ వాల్స్‌ నిర్మాణంలో ఆర్‌సీసీ కాంక్రీట్‌, ఆపైన రాఫ్ట్‌ దానిపైన డ్యాం నిర్మించి ఉంటే కుంగుబాటుకు అవకాశం ఉండేది కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. అసలు సాంకేతికంగా డిజైన్‌ ప్రకారమే అనుసరించారా? నాణ్యత పాటించారా? అని వారు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు డయాఫ్రం వాల్‌, సీకెంట్‌ పైల్‌ విఫలమవడంతో కుంగుబాటు చోటుచేసుకుందని లోపాలు జరిగాయని గుర్తించిన సమయంలోనే ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను నిలదీశారు.

Congress Minister On Medigadaa Damage : డ్యాం నిర్మించిన రెండో ఏడాదే 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెబుతున్న అధికారులు ఆ సమయంలో రక్షణ నిర్మాణాలు కొట్టుకుపోయాయని గుర్తించారని మంత్రులు తెలిపారు. అయితే అప్పుడే డౌన్‌ స్ట్రీం వాల్‌ ప్రభావితమై ఉంటుందనేది వాస్తవమా కాదా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ ఏడో బ్లాకు సమీపంలో లీకేజీ ఉందని, చర్యలు చేపట్టాలని నిర్మాణ సంస్థకు 2022 ఏప్రిల్‌ 28న ఈఈ లేఖ రాసినప్పుడే ఎందుకు స్పందించి చర్యలు చేపట్టలేదు? అని గత ప్రభుత్వ తీరుని ఎండగట్టారు.

మూడో టీఎంసీ తరలింపునకు మొదట భూగర్భ సొరంగం నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, తర్వాత పైపులైనుకు మార్చారని మంత్రులు తెలిపారు. నిర్మాణానికి సమయం సరిపోదనే మార్చినట్లు దస్త్రాల్లో చూపారని, రెండు టీఎంసీల పనులే పూర్తికానప్పుడు మూడో టీఎంసీ నిర్మాణాలకు అంత తొందర ఏం వచ్చింది? అని నిలదీశారు.

ఏంటీ! మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదాన్ని ఏడాదిన్నర కిందటే గుర్తించారా? మరెందుకు ఆపలేదు?

ప్రజలకు నిజనిజాలు తెలియాలంటే న్యాయవిచారణ జరగాలి : కడియం శ్రీహరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.