అగ్గిరాజేస్తోన్న జగిత్యాల మాస్టర్​ ప్లాన్​.. తిమ్మాపూర్​లో రోడ్డెక్కిన రైతన్నలు

author img

By

Published : Jan 16, 2023, 4:44 PM IST

Updated : Jan 16, 2023, 8:51 PM IST

Farmers dharna on Jagityala

Jagtial Master Plan Controversy : జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌.. కామారెడ్డి తరహాలో అగ్గిరాజేస్తోంది. రోజు రోజుకీ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. బృహత్‌ ప్రణాళికను రద్దు చేయాలంటూ.. వ్యవసాయ యోగ్యమైన భూములు ఇవ్వమంటూ.. రైతులు నిరసనల ఉద్ధృతం అవుతున్నాయి. తిమ్మాపూర్‌ గ్రామ ప్రజాప్రతినిధులు ఏకంగా తమ పదవులకు రాజీనామా చేశారు.

అగ్గిరాజేస్తోన్న జగిత్యాల మాస్టర్​ ప్లాన్​.. తిమ్మాపూర్​లో రోడ్డెక్కిన రైతులు

Jagtial Master Plan Controversy : జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాల ప్రభావిత గ్రామాల రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జగిత్యాల-నిజామాబాద్‌ రహదారిలో హుస్నాబాద్‌ వద్ద అంబారిపేట, హుస్నాబాద్‌ రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జగిత్యాల గ్రామీణ మండలం తిప్పన్నపేట రైతులు, ధర్మపురి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

తిమ్మాపూర్‌ గ్రామసభ.. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ తీర్మానం చేసింది. రైతులతో కలిసి గ్రామ ప్రజాప్రతినిధులు రాస్తాకోరో చేపట్టారు. పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తమ డిమాండ్లపై అధికారులు స్పందించటం లేదని ఆగ్రహించిన తిమ్మాపూర్‌ గ్రామ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడే సర్పంచ్‌ రమ్యతో పాటు పాలక మండలి, వార్డు సభ్యులు పదవికి రాజీనామా చేశారు.

నర్సింగాపూర్‌, మోతె, అంబారిపేట తదితర గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు సైతం రాజీనామా యోచనలో ఉన్నారు. మరిన్ని గ్రామాల రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

"ఈరోజు మాస్టర్​ ప్లాన్​ను రద్దుకోరుతూ హస్నాబాద్‌ పరిసర ప్రాంతాల ప్రజలందరం కలిసి రోడ్డుపై బైఠాయించాం. ఇందులో భూములు ఉన్నవాళ్లంతా బీద రైతులే. ప్రభుత్వం ఏమో మీ సర్పంచ్​లు అందరూ కలిసి తీర్మానం ఇచ్చారు అని చెబుతున్నారు. కానీ మేము తీర్మానం ఇచ్చింది రోడ్లు, డ్రైనేజీ, విధి దీపాలు కోసం. మాకు తప్పుడు సమాచారం ఇచ్చి నింద మాపై తోస్తున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని మాస్టర్​ ప్లాన్​ రద్దు చేయాలని కోరుతున్నాం".- సర్పంచ్​, హస్నాబాద్‌

"మాది అంబారిపేట. మేము కాయకష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇందులో చాలా మంది బీద రైతులే ఉన్నారు. మా భూముల కోసం ఎంతవరకైనా పోరాడుతాం".- మహిళ రైతు, అంబారిపేట

"నేను అంబారిపేట గ్రామ సర్పంచ్​ను. ఈరోజు ధర్నాలో మా చుట్టుపక్కల గ్రామస్థులందరూ కలిసి పాల్గొన్నాం. మాస్టర్​ ప్లాన్​లో మా భూములన్ని ఉన్నాయి. దీనికోసం ఎవరి అభిప్రాయం తీసుకోలేదు. ఇందులో చాలా వరకు చిన్న, సన్నకారు రైతుల భూములే ఉన్నాయి. బడానాయకులు భూములు మాత్రం ఈ మాస్టర్ ప్లాన్​లో లేవు. రైతులకు అన్యాయం జరిగే ఈ ప్లాన్​ను తక్షణం రద్దుచేయాలి".- సర్పంచ్​, అంబారిపేట

ఏంటి ఈ మాస్టర్​ ప్లాన్​ వివాదం: 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌, పార్క్‌, ప్లేగ్రౌండ్స్‌ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్‌, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.

ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్‌, కండ్లపల్లి, తిమ్మాపూర్‌, తిప్పన్నపేట, హస్నాబాద్‌, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 16, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.