Railway Minister on Telangana: 2009 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే కేటాయింపుల్లో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.3,048 కోట్లు తెలంగాణకు కేటాయించిందని రైల్వేశాఖ మంత్రి తెలిపారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే డబ్లింగ్, త్రిబ్లింగ్కు అదనంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే ఉందని విమర్శించారు. కాజీపేటలో పీరియాడిక్ ఓవరాలింగ్ (POH) వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
'ఎంఎంటీఎస్ నిర్వహణకు కేంద్రం ఒక వంతు, రాష్ట్రం రెండొంతుల నిధులు ఇవ్వాలనేది ఒప్పందం. దురదృష్టవశాత్తు కేంద్రం తనభాగం చెల్లించినా.... రాష్ట్రం తన వంతు చెల్లింపులు చేయడం లేదు. రూ. 631 కోట్ల బకాయిలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ విషయానికొస్తే... మేధా సెర్వో సిస్టమ్స్కు కేంద్రం భారీ ప్రాజెక్టు ఇచ్చింది. దానివల్లే తెలంగాణలో మేధా ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తోంది. కాజీపేట విషయానికొస్తే.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం భూమి అందించింది. ఇప్పటికే నిధులు కేటాయించాం. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. అక్కడ పీవోహెచ్ ఏర్పాటవుతుంది. కేంద్రం తన హామీలకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రానికి సహకరించాలి.'
- అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖ మంత్రి
ఇదీచూడండి: దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం: కేసీఆర్