ETV Bharat / state

TSPSC Paper Leak Latest Update : ప్రశ్నపత్రాల లీకేజీలో బయటపడుతున్న కొత్త లింకులు

author img

By

Published : May 10, 2023, 7:59 AM IST

TSPSC
TSPSC

TSPSC Paper Leakage Issue Latest Update : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త లింకులు బయటపడుతున్నాయి. సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు కూడా ఏఈ, ఏఈఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. నలుగురితో అరెస్టుల సంఖ్య 27కు చేరింది. నలుగురు నిందితులు కూడా ప్రవీణ్, డాక్యా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధాలున్న మరో 10 మంది అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

TSPSC Paper Leakage Issue Latest Update : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో నలుగురిని సిట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్​కు చెందిన ఆది సాయిబాబా, మాడావత్ శివకుమార్, నాగార్జునసాగర్ నివాసి రమావత్ మహేశ్​, ఖమ్మం జిల్లాకు చెందిన పొన్నం వరుణ్​లు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ వద్ద ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్రశ్నపత్రం రూ.10లక్షలకు ప్రవీణ్ బేరమాడాడు. అడ్వాన్సుగా ఒక్కొక్కరు అతనికి లక్షన్నర రూపాయలు చెల్లించారు. ఫలితాలు వెల్లడయ్యాక మిగిలిన సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరితో సంబంధాలున్న మరో 10 మంది అనుమానితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో కొందరు సెల్​ఫోన్లు స్విచ్‌ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వీరంతా అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణకు వచ్చింది.

ప్రశ్నపత్రాల లీకేజీలో బయటపడుతున్న కొత్త లింకులు: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల కొనుగోళ్ల వ్యవహారంలో కొత్త లింకులు బయటపడుతున్నాయి. మార్చి 13న ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు లీకేజీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో సంబంధాలున్న 8 మందిని తొలుత బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసు దర్యాప్తు నగర సిట్​కు బదిలీ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ పోలీసులు లీకుతో సంబంధాలున్న ఒక్కో లింకును చేదిస్తూ వస్తున్నారు. మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలంలోనే 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్​ను రెండుసార్లు పోలీసు కస్టడీకి తీసుకొని విచారించారు. పోలీసులు ఎదుట అమాయకంగా నటిస్తూ వచ్చిన ప్రవీణ్ తెర వెనుక పెద్ద వ్యవహారమే నడిపినట్టు ఆధారాలు సేకరించారు. మీర్​పేటలోని అతడి నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, కాల్ డేటా, బ్యాంకు ఖాతా ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులను గుర్తించి సిట్ పోలీసులు వారిని అరెస్టు చేస్తూ వస్తున్నారు.

మస్కా కొట్టాలని చూసినా..: మహబూబ్​నగర్ జిల్లాతో మొదలైన లీకేజీ లింకులు హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు పాకాయి. మున్ముందు ఇంకెన్ని లింకులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధం చేసిన మాస్టర్ ప్రశ్నపతాలను తన పెన్​డ్రైవ్​లోకి డౌన్లోడ్ చేయించుకున్న ప్రవీణ్‌... మొదటగా గ్రూప్స్ ప్రశ్నపత్రాలను రాజశేఖర్​రెడ్డి, షమీమ్, సురేష్ కుమార్​లకు ఇచ్చాడు. చేతికి అందిన ఏఈ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్​సిర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ప్రశ్నపత్రాలను తనకున్న పరిచయాల ద్వారా బేరం కుదుర్చుకొని విక్రయించాడు. వేతనం జమయ్యే బ్యాంకు ఖాతాలో కాకుండా మరో ఖాతాలోకి ఆ నగదును జమచేయించుకున్నాడు. కొందరి వద్ద నగదు రూపంలో తీసుకున్నాడు. ఎంతో తెలివిగా వ్యవహరించి పోలీసులకు మస్కా కొట్టాలని చూసినా సాంకేతిక పరిజ్ఞానం, కాల్‌ డేటా, వాట్సాప్ సందేశాల ఆధారంగా ప్రవీణ్ లీలలను పోలీసులు వెలికితీస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.