ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో ఇకపై భారీ మార్పులు..!

author img

By

Published : Mar 23, 2023, 7:35 AM IST

TSPSC Online Recruitment Tests
TSPSC Online Recruitment Tests

TSPSC Online Recruitment Tests: పోటీ పరీక్షల నిర్వహణలో ఇక భారీ మార్పుల దిశగా టీఎస్​పీఎస్సీ అడుగులేస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించేందుకు గానూ ఆన్‌లైన్‌ ఫార్ములా అమలు చేయబోతుంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రశ్నల నిధి రూపొందించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల మంది హాజరయ్యే పరీక్షలకు మాత్రమే మౌలిక వసతులు ఉన్నాయి. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి.. నార్మలైజేషన్‌ విధానం అమలు చేయాలని కమిషన్‌ యోచిస్తోంది.

టీఎస్​పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో ఇకపై భారీ మార్పులు

TSPSC Online Recruitment Tests: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో ప్రకంపనలు రేగుతున్న వేళ.. భారీ ప్రక్షాళన దిశగా టీఎస్​పీఎస్సీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ విధానమే సరైందిగా భావిస్తోంది. ఇప్పటికే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఐబీపీఎస్, ఇతర పీఎస్సీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశ కమిటీలు నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

TSPSC Exercise on Conducting Online Exams: ఏటా ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో.. లక్షలాది మంది అభ్యర్థులకు ఒకే రోజున పరీక్షలు నిర్వహించడం ఆషామాషీ కాదు. ఈ క్రమంలో ఆయా సంస్థలు అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్‌ ఎగ్జామ్​లు నిర్వహిస్తున్నాయి. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజులపాటు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి.

50 వేల మంది ఆన్​లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం: తాజాగా ఇంజినీరింగ్‌, ప్రొఫెషనల్‌ కళాశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50 వేల మంది వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని అంచనా. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. ఇంజినీరింగ్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ పరీక్షలపై అభ్యర్థుల్లో అవగాహన ఉంది.

దీంతో టీఎస్​పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎమ్​వీఐ, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, ఏఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనుంది. గ్రూపు సర్వీసుల ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని గతంలోనే భావించినప్పటికీ, నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్నే కొనసాగించింది. ప్రస్తుతం ఓఎమ్​ఆర్ పద్ధతి అవలంభించినప్పటికీ, భవిష్యత్తులో నార్మలైజేషన్‌ ఆధారితంగా విడతల వారీగా పరీక్షలు పూర్తి చేసేలా నిబంధనలు సవరించనుంది.

ఎంసెట్, ఐఐటీ, మెడికల్ తదితర పరీక్షలకు కంప్యూడరైజ్డ్ ఫార్ములా: ఏదేని నియామక పరీక్ష, ప్రవేశ పరీక్షకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉంటే విడతల వారీగా నియామక సంస్థలు వివిధ సెట్లతో ఆన్‌లైన్‌ పరీక్షలు జరుపుతుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వీటిని రెండుమూడ్రోజుల పాటు అందరూ హాజరయ్యేలా ప్రణాళికలు చేసి పూర్తి చేస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ఎంసెట్, ఐఐటీ, మెడికల్‌ తదితర పరీక్షలకు కంప్యూటరైజ్డ్‌ విధానం అమలు అవుతోంది. ఉదయం కొంత మందికి పరీక్ష జరిగితే, మధ్యాహ్నం మరికొంత మందికి పరీక్షలు జరుగుతున్నాయి.

ఒకపూట నిర్వహించిన పరీక్షకు వచ్చిన ప్రశ్నలు మరోపూట పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రావు. ఈ మేరకు భారీ సంఖ్యలో ప్రశ్నల నిధి ఉంటుంది. ప్రశ్నల కాఠిన్యతలోనూ తేడా ఉంటుంది. ఉదయం పూట పరీక్ష ప్రశ్నల కాఠిన్యత ఎక్కువగా ఉంటే.. మధ్యాహ్నం కాఠిన్యత తక్కువగా ఉండొచ్చు. ఈ వ్యత్యాస నేపథ్యంలో నార్మలైజేషన్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలో గరిష్ఠంగా మార్కులు వచ్చిన సగటు, స్టాండర్డ్‌ డీవియేషన్‌ తీసుకుని లెక్కిస్తారు.

ఆన్​లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ కార్యాచరణ: అలాగే మధ్యాహ్నం పూట పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇదే పద్ధతిని పాటించి నార్మలైజేషన్‌ ఫార్ములా ప్రకారం తుది మార్కులు లెక్కిస్తారు. తొలుత ప్రొఫెషనల్‌ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. పరీక్షలను సీబీఆర్టీ లేదా ఓఎమ్​ఆర్ విధానంలో నిర్వహిస్తామని ఉద్యోగ ప్రకటనలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పష్టంగా పేర్కొంది. ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతున్నందున.. వాటి అమలు తీరుపై అధ్యయనం జరిపి రాష్ట్రంలోనూ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్‌ కార్యాచరణ రూపొందించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.