ETV Bharat / state

గ్రూప్​-1 పరీక్షలో 121 మందికి 100 మార్కులు.. టీఎస్​పీఎస్సీలో మరో ముగ్గురు అరెస్టు

author img

By

Published : Mar 22, 2023, 8:50 PM IST

Updated : Mar 22, 2023, 10:35 PM IST

TSPSC Paper Leackage SIT Investigation: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీలో సిట్​ దూకుడు పెంచింది. ఈ కేసు వ్యవహారంలో ఐదోరోజు తన విచారణను కొనసాగిస్తూ.. పలు కీలక విషయాలను సేకరించింది. ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు టీఎస్​పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. మరోవైపు కమిషన్​లోని 40మంది ఉద్యోగులకు సిట్​ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీలో కోచింగ్ సెంటర్లకు కూడా సంబంధముందని అనుమానిస్తోంది.

tspsc
tspsc

గ్రూప్-1 లీకేజీ ఫలించిన తర్వాతే ఇతర పేపర్లు లీక్‌ చేశారు

TSPSC Paper Leackage SIT Investigation: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్​-1లో 121 మంది విద్యార్థులకు 100 మార్కులు వచ్చినట్లు సిట్​ దర్యాప్తులో తేలింది. ఆరురోజుల కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్.. పలు కీలక ఆధారాలు రాబట్టింది. రేణుక, డాక్యానాయక్​ కాల్​ డేటాను పరిశీలించగా.. అభ్యర్థులు, కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులతో మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. కమిషన్​లోని 10 మందితో పాటు, మరో 40 మంది సభ్యులకు సిట్​ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులకు, అభ్యర్థులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో సిట్​ ఉన్నదని సమాచారం.

టీఎస్​పీఎస్సీ కమిషన్​లో ముగ్గురు ఉద్యోగులు అరెస్టు: టీఎస్‌పీఎస్‌సీ నుంచి 20 మంది పరీక్ష రాస్తే.. అందులో ఇద్దరికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి రమేష్‌కు, మహిళా ఉద్యోగినికి సైతం 100కు పైగా వచ్చినట్లు సిట్​ అధికారులు తెలుసుకున్నారు. ఈ ఆధారాలతో కమిషన్​లోని రమేష్​, షమీమ్, సురేష్​​లను నిందితులుగా చేర్చి.. వీరిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్​కు.. టీఎస్​పీఎస్సీ కమిషన్​లో 20 మందికిగానూ, 8 మంది మెయిన్స్​కు అర్హత సాధించినట్లు గుర్తించారు. ఈ ముగ్గురి చేరికతో ప్రశ్నాపత్నం లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరుకుంది.

గ్రూప్​-1 పరీక్ష రాసిన 121 మందికి 100 మార్కులు: గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్షలో 121 మందికి మాత్రమే నూరుకు పైగా మార్కులు వచ్చాయని సిట్​ దర్యాప్తులో తెలిసింది. టీఎస్​పీఎస్సీ కమిషన్​ నుంచి గ్రూప్​-1 రాసిన అభ్యర్థుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే 100 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు.

TSPSC Paper Leackage 5th Day SIT Investigation: విచారణలో భాగంగా మంగళవారం ఉద్యోగులకు చెందిన పలు వివరాలను.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర్‌లక్ష్మి నుంచి.. సిట్‌ అధికారులు సేకరించారు. శంకరలక్ష్మి చెప్పిన వివరాలతో పోలీసులు ఆరా తీశారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా టీఎస్​పీఎస్సీకి చెందిన 10 మంది పరీక్ష రాసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఐదో రోజు కస్టడీలో ప్రధాన నిందితులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, రేణుక, డాక్యా నాయక్‌ దంపతుల బ్యాంకు ఖాతాలకు చెందిన వివరాలు సేకరించారు. కొంతకాలంగా జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై.. సిట్‌ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

గ్రూప్‌-1 పేపర్ లీకేజీ కుట్రలో అధికంగానే అభ్యర్థులు లబ్ధి పొందినట్లు సిట్ భావిస్తోంది. గతేడాది గ్రూప్‌-1 లీకేజీ ఫలించిన తర్వాతనే ఇటీవల జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్‌ని లీక్‌ చేసినట్లు సిట్‌ అధారాలు సేకరించింది. ఏఈ పేపర్ లీకేజీ విజయవంతం కావడంతో ఆ తర్వాత జరిగిన.. టౌన్‌ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పేపర్‌ని బేరం పెట్టినట్లు తేల్చారు. నిందితుల కస్టడీ గురువారం ముగియనుండటంతో మరోమారు కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్‌ వేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 22, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.