ETV Bharat / state

టీఆర్​ఎస్ నుంచి బీఆర్​ఎస్.. 21 ఏళ్ల పార్టీ ప్రస్థానం ఇదే..

author img

By

Published : Dec 9, 2022, 6:56 AM IST

TRS TO BRS: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 21ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. భారత్‌ రాష్ట్ర సమితి పేరుతో.. జాతీయ రాజకీయాల్లో కీలకశక్తిగా మారేందుకు గులాబీ పార్టీ ఇవాళ్టి నుంచి అడుగులు వేయనుంది. దేశంలో గుణాత్మక మార్పే ధ్యేయంగా కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వెళ్లనుంది. దేశంలో కొత్త రాజకీయ శక్తిగా బీఆర్ఎస్​ను మార్చేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు.

TRS TO BRS
TRS TO BRS

TRS TO BRS: తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయంపాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.

TRS to BRS Journey : 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తోపాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

KCR Journey from TRS to BRS : 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉపఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్.

ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్: ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఘనవిజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవతెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా: బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.

గులాబీ పార్టీలో కొత్త వాతావరణం: పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు.

కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్​కు అంత అనుకూలంగా రాలేదు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. 32కు 32 జిల్లా పరిషత్ పీఠాలు, కొన్ని మినహా అన్ని నగర, పురపాలికల పీఠాలను కైవసం చేసుకొని సత్తా చాటింది. అయితే ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి.

పలు అంశాల్లో తనదైన ముద్ర: సిట్టింగ్ స్థానాలైన దుబ్బాక, హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థులు ఓటమిపాలు కాగా బల్దియాలో ఆశించిన సంఖ్యను అందుకోలేక పోయింది. ఇటీవలి మునుగోడు ఉపఎన్నికలో గులాబీపార్టీ మళ్లీ విజయాన్ని కైవసం చేసుకొంది. స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.

కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా: నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాష్ట్రంలో పంటలు రికార్డు విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా రైతు ఆందోళనలు, పంటల కొనుగోళ్లు, .. కొవిడ్ అనంతర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరి, తదితర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ దృష్టి మరోమారు జాతీయ రాజకీయాలపై పడింది.

దేశంలో గుణాత్మక మార్పే ధ్యేయంగా: బీజేపీ సర్కార్ వైఖరి, విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీతో నేరుగా తలపడుతున్నారు. మొదటి దఫాలో ఎన్డీయేతో సఖ్యతగానే ఉండి అన్నింటా మద్ధతు పలికిన టీఆర్ఎస్.. గత రెండేళ్లుగా పూర్తిగా విభేదిస్తూ వస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాలు బలపర్చిన అభ్యర్థులకు మద్ధతు ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పే ధ్యేయంగా వివిధ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లి బీజేపీ, కాంగ్రెస్సేయేతర ముఖ్యమంత్రులు, పార్టీల నేతలతో మంతనాలు జరిపారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పోరాటం జరపాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని వివరిస్తూ తన ఆలోచనల్ని వివరించారు. కొందరు నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రైతు ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త రైతుసంఘాల నేతలను హైదరాబాద్ రప్పించి వారితో ప్రత్యేకంగా రెండు రోజులపాటు సమావేశమయ్యారు.

ప్రధానంగా తెలంగాణ నమూనా : రైతు ఎజెండా, ప్రధానంగా తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా అమలు కావాలని అంటున్నారు. ఆ దిశగా అందరమూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలని అంటున్నారు. దేశాన్ని ఇన్నేళ్లపాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దారుణంగా విఫలమయ్యాయంటోన్న కేసీఆర్.. ప్రగతిశీల భారత్ ధ్యేయంగా ఆ రెండు పార్టీలతో సంబంధం లేకుండా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి.. భారత్ రాష్ట్ర సమితిగా మార్పును ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో... ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాలను కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

ఇవీ చదవండి: ఎయిర్‌పోర్టుకు ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు..నిర్మాణానికి నేడు సీఎం భూమి పూజ

'కొలీజియం ఈ దేశ చట్టం.. దీనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.