ETV Bharat / state

Revanth Reddy: 'కరోనాను ఎదుర్కోడానికి వ్యాక్సిన్... కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు'

author img

By

Published : Jun 30, 2021, 2:33 PM IST

Updated : Jun 30, 2021, 4:53 PM IST

tpcc
రేవంత్

కరోనాను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్​ అవసరమైనట్టుగా... రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగాలంటే ఎన్నికలు రావాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

సీఎం కేసీఆర్​పై రేవంత్ రెడ్డి విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) ఎప్పుడు ఏం చేస్తారో, ఏ రాత్రి ఎన్నికలకు వెళతారో తెలియదని అందుకే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) సూచించారు. హైదరాబాద్​ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెండేళ్లు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి సర్వరోగ నివారణ ఎన్నికలేనని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రేవంత్‌ తెలిపారు. తెరాస ప్రభుత్వం ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని పేర్కొన్నారు.

సోనియా మనిషిని...

తమది కాంగ్రెస్ కుటుంబమని... తాను సోనియాగాంధీ (Sonia Gandhi) మనిషినని స్పష్టం చేసిన రేవంత్‌ రెడ్డి... ప్రత్యేక సందర్భాల్లో తాను ఇతర పార్టీల్లో పనిచేశానన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో తెలియదని... కేసీఆర్ బిడ్డ పోలికలున్న బొమ్మ అయితే కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి... అమరవీరుల స్తూపాన్ని కూడా వదల్లేదని ఆరోపించారు. అందులో కూడా కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు.

అన్ని బయటపెడతా...

త్వరలోనే పూర్తి ఆధారాలతో బయట పెడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రావణాసురుడిని ఎదుర్కోడానికి వానర సైన్యం అంతా ఎలా పనిచేసిందో కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్ శ్రేణులు అలా సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత ఒక తరం నష్టపోయిందన్న రేవంత్‌ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రణాళిక నిరుద్యోగ సమస్యపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదకరమని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చిందని, కేసీఆర్‌ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు.

ఉపఎన్నికలు రావాలా?

ఏడేళ్లుగా దళితులపై దాడులు, అక్రమ అరెస్టులు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోలేదని రేవంత్‌ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే ఉపఎన్నికలు రావాల్సిందేనా అని ప్రశ్నించారు. ముందు దుబ్బాక, ఆ తరువాత నాగార్జున సాగర్ ఇప్పుడు హుజురాబాద్‌లో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయన్నారు.

తనకంటే ఎక్కువ అనుభవం కలిగిన వారెందరో జిల్లా అధ్యక్షులుగా ఉన్నారని వారిలో ఉత్సాహం నింపేందుకే తనను సోనియాగాంధీ టీపీసీసీ చీఫ్‌గా నియమించారన్నారు. అందరి అభిప్రాయం మేరకే తాను పార్టీని ముందుకు తీసుకెళతానని స్పష్టం చేశారు.

కరోనా వల్ల నిరు పేదల జీవితాలు చితికిపోయాయి. కరోనా ఒకవైపు, మరోవైపు కేసీఆర్‌ ప్రజలను వేధిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వేసిన లక్షల బిల్లుల వల్ల ప్రజలు చితికిపోయారు. సామాజిక న్యాయం జరగాలంటే తెరాస గద్దె దిగాలి. తన చపలచిత్తంతో కేసీఆర్‌ ఎప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారో తెలియదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియనందున పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.

-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

ఇదీ చూడండి: రాత్రికి రాత్రే రోడ్డు మాయం- ఎలా జరిగింది?

Last Updated :Jun 30, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.