Kodanda Ram met Bhupendra Yadav: జహీరాబాద్ నిమ్జ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను దిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. నిమ్జ్ పేరిట 22 గ్రామాల్లో 12 వేల 600 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోందని కేంద్ర మంత్రికి తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చి కేంద్రం నుంచి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కోదండరాం ఆరోపించారు. రైతుల నుంచి బలవంతంగా సేకరించి తక్కువ ధరకు పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఈ విషయంపై కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్కు లేఖ రాస్తామని కోదండరాం తెలిపారు. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. కోదండరాంతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి మొగుడం పల్లి ఆశప్ప, రైతు రాఘవరెడ్డి తదితరులు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
"12 వేల ఎకరాల్లో సుమారు 4వేల ఎకరాలను పరిశ్రమల కోసం వినియోగిస్తారు. మిగిలిన భూమిని పార్కులు, రిక్రియేషన్ కోసం ఉపయోగిస్తారు. కానీ ప్రభుత్వం తన స్వార్థం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోంది. కేంద్రానికి తప్పుడు నివేదిక చూపించి అనుమతులు పొందాలని చూస్తున్నారు. ఎంతో మంది ఆ భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారు. వారి నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారికి అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్కు వచ్చే మంజీరా నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది. " -కోదండ రాం, తెజస అధ్యక్షుడు
ఇవీ చదవండి: గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి: కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ
'రబ్బర్ స్టాంప్' రాజకీయం! పంజాబ్ అధికారులకు కేజ్రీవాల్ ఆదేశాలా?