ETV Bharat / state

డిజిటల్‌ సర్వే తర్వాత కూడా పాత సర్వే నంబర్లే!

author img

By

Published : Jun 9, 2021, 8:14 AM IST

రాష్ట్రంలో చేపట్టనున్న డిజిటల్‌ భూ సర్వే తర్వాత కూడా పాత సర్వే నంబర్లనే కొనసాగించాలని భావిస్తున్నారు. 85 ఏళ్ల క్రితం రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఏర్పాటు చేసిన నంబర్లే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి.

survey
డిజిటల్‌ సర్వే తర్వాత కూడా పాత సర్వే నంబర్లే!

తరాలు మారి వారసత్వంగా భూమి భాగాలుగా విడిపోతుండటం, క్రయవిక్రయాల అనంతరం ఉప సంఖ్యలు ఏర్పాటు చేయాల్సి వస్తుండటంతో పాత నంబర్ల పక్కనే బై నంబర్లు వేసి యాజమాన్య హక్కులు కల్పిస్తూ వస్తున్నారు. ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముందువరకు రాత పద్ధతిలోనే దస్త్రాలు కొనసాగిన నేపథ్యంలో ఈ నంబర్లలో అనేక దిద్దుబాట్లు జరిగాయి. తప్పులు దొర్లాయి. 2017లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా ఇలాంటి తప్పులను రెవెన్యూ సిబ్బంది గుర్తించారు.

రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి 27 గ్రామాల్లో నమూనా సర్వే చేపట్టనున్నారు. వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్త సర్వేకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికైతే పాత సర్వే నంబర్లను కొనసాగించాలని రెవెన్యూశాఖ భావిస్తున్నట్లు సమాచారం. నమూనా సర్వేలో ఎదురయ్యే అనుభవాలనుబట్టి ఈ నిర్ణయం మారే అవకాశాలు ఉండొచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే, పలు సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణాలను కలిపి యజమాని పేరుతో ఖాతాను నిర్వహిస్తున్నారు. ఈ ఖాతా సంఖ్యలను కూడా పాతవాటినే కొనసాగించాలా లేదా వాటి స్థానంలో ప్రత్యేక సంఖ్య ఏర్పాటు చేయాలా అనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. డిజిటల్‌ సేవల్లో భాగంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను నిర్వహిస్తున్న క్రమంలో సర్వే అనంతరం కొత్త సర్వే నంబర్లను వినియోగంలోకి తెస్తే మళ్లీ పోర్టల్లోని భూ సమాచారంలో మార్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్టల్లో భూ యజమానుల వివరాల ప్రకారం వారి భూములను సర్వే చేయనున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సరిహద్దులు గుర్తించి సర్వే పూర్తి చేయనున్నారు.

ఇదీ చదవండి: LOCKDOWN: రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.