ETV Bharat / state

Metro Rail: 'మెట్రో'కి అన్ని ఆస్తులున్నాయా? ఆదాయం ఎందుకు తగ్గింది? నష్టానికి కారణాలేంటి?

author img

By

Published : Oct 11, 2021, 11:42 AM IST

హైదరాాబాద్ మెట్రో రైల్​ నష్టాలకు కొవిడ్​ కారణమా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అందుబాటులో కావాల్సినన్నీ భూములున్నా కూడా ఎల్‌అండ్‌టీ సరిగా వినియోగించుకోలేకపోతోందా? ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు ఇతరత్రా కారణాలున్నాయా? అనేది దీనిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోంది.

Metro Rail
హైదరాాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ ఎల్‌అండ్‌టీ మెట్రోకు టిక్కెట్ల ద్వారా 50 శాతం ఆదాయం వస్తుంది. మరో 45 శాతం.. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో మాల్స్‌, కార్యాలయాల భవనాలు నిర్మించి అద్దెకు, లీజుకివ్వడం ద్వారా సమకూర్చుకోవాలి. మిగతా 5 శాతం ప్రకటన రూపంలో రాబట్టుకోవాలి. కానీ ఆ సంస్థ మూడు కారిడార్లలో రైళ్లను తిప్పుతోంది కానీ.. ఆయా మార్గాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ)ని పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు, కొవిడ్‌ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కారణమా? ఇతరత్రా కారణాలున్నాయా? అనేది దీనిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోంది.

ఆదాయం ఎందుకు తగ్గింది?

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్‌ మెట్రోకు ప్రభుత్వం కేటాయించిన 269 ఎకరాల స్థలంలో డిపోలు పోగా మిగతా స్థలంలో 18.5 మిలియన్‌ చదరపు అడుగుల(మి.చ.అ.) విస్తీర్ణంలో వాణిజ్య నిర్మాణాలు పూర్తి చేయాలి. వీటిని 60 ఏళ్ల పాటు అద్దెకు, లీజుకు ఇచ్చి, ఆ తర్వాత ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. ఇప్పటికి 10 శాతమూ లోపే అంటే కేవలం 1.8 మి.చ.అ. విస్తీర్ణంలో మాత్రమే అభివృద్ధి చేసింది. టీవోడీపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టకపోవడం వల్ల రావాల్సిన ఆదాయం సంస్థకు రావడం లేదని పరిశీలన కమిటీ గుర్తించింది. నగరంలో స్థిరాస్థి రంగం దూసుకెళుతోంది. కార్యాలయాల నిర్మాణాలు, లీజింగ్‌లో హైదరాబాద్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ రంగాన్ని ఎల్‌అండ్‌టీ మెట్రో అందిపుచ్చుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 45 శాతం ఆదాయం వచ్చే కీలకమైన టీవోడీని విస్మరించిందని కమిటీ అభిప్రాయంగా ఉన్నట్లు సమాచారం. డిమాండ్‌ ఉన్న స్టేషన్లలో మాల్స్‌ పూర్తిచేసి ఉంటే ఆదాయం భారీగా వచ్చేది. ఒడిదొడుకులను నిలదొక్కుకునేందుకు అవకాశం ఉండేది. గతంలో చెప్పినట్లు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేపట్టలేదు. మెట్రో పూర్తయ్యేనాటికి 6 మి.చ.అ. మేర టీవోడీ పూర్తిచేస్తామని చెప్పి నిలబెట్టుకోలేకపోయింది. పూర్తయిన నిర్మాణాల్లోనూ లీజులకు ఇవ్వడంలో వెనుకబడింది. ఈ విషయాలన్నీ కమిటీ దృష్టికొచ్చాయి. దీనిపై ఎల్‌అండ్‌టీ మెట్రో వాదనలు మరోలా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దశలవారీగా నిర్మాణాలు పూర్తిచేస్తామని చెబుతోంది.

కష్టకాలంలో ఆదుకోరూ..

విమానాశ్రయ నిర్మాణం ప్రారంభంలో జీఎంఆర్‌కు సాఫ్ట్‌లోన్‌ ఇచ్చిన మాదిరే తమను కొవిడ్‌ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు సాఫ్ట్‌లోన్‌ ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు కోరారు. హైదరాబాద్‌కు మెట్రో లాంటి ఓ ఆస్తిని అందించామని.. ఆదుకోవాలని విన్నవించారు. ఈ నేపథ్యంలోనే పరిశీలనకు సీఎం ఉన్నత స్థాయి కమిటీని వేశారు. ‘కొవిడ్‌తో మెట్రో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. తప్పకుండా ఆదుకుంటామని’ మంత్రి కేటీఆర్‌ ఇటీవల శాసనమండలిలో ప్రకటించారు.

* వాణిజ్యపరంగా కీలకమైన రసూల్‌పురాలో సంస్థకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉంది.

* మియాపూర్‌, నాగోల్‌ డిపోలతోపాటు ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, ప్యారడైజ్‌ తదితర స్టేషన్లలో భూములున్నా నిర్మాణాలు చేపట్టలేదు.

* రాయదుర్గంలో నిర్మాణం ప్రారంభించినా నత్తనడకన సాగుతోంది.

* మాల్స్‌ నిర్మించిన స్టేషన్లు: పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌

* 269 ఎకరాలు.. ఎల్‌అండ్‌టీకి కేటాయించిన భూమి(డిపోలతో కలిపి)

* 18.5 మి.చ.అ. ఎల్‌అండ్‌టీ మెట్రో కట్టాల్సిన స్థిరాస్తి ప్రాజెక్టులు

* 1.8 మి.చ.అ. నాలుగు చోట్ల నిర్మాణం

* 6 మి.చ.అ. మెట్రో నిర్మాణం పూర్తయ్యేనాటికి అభివృద్ధి చేస్తామని చెప్పిన టీవోడీ

ఇదీ చూడండి: CM KCR: మెట్రోకు పూర్వవైభవం తెచ్చేందుకు అత్యున్నత స్థాయి కమిటీ: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.