ETV Bharat / state

తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

author img

By

Published : Jul 23, 2020, 6:47 AM IST

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నా.. కొవిడ్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత 14 రోజుల గణాంకాలను పరిశీలిస్తే ఇదే తేలుతోంది.. రోజుకు నమోదవుతున్న కేసులు సుమారు 1200 నుంచి 1600 వరకూ ఉంటుండగా, కరోనా బారినపడి కోలుకుంటున్నవారు కూడా రోజుకు సుమారు 1200 - 2000 మధ్య ఉంటున్నారు. దీనినిబట్టి చూస్తే కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారి కంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని వైద్యశాఖ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.

The Corona conquerors in ts state are 76 percent
రాష్ట్రంలో కరోనాను జయించినవారు 76 శాతం

ఈనెల 22 (బుధవారం) వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం (49,259) కేసుల్లో.. 76 శాతం (37,666) మంది కొవిడ్‌ నుంచి ఆరోగ్యవంతులుగా బయటపడ్డారు. వీరిలో దాదాపు 15,000 మంది (30 శాతం పైనే)ఇళ్లలోనే చికిత్స పొందారని వైద్యవర్గాలు చెప్పాయి. ఆసుపత్రిలో చేరకుండానే.. వీరంతా కొవిడ్‌ను జయించారు.

మున్ముందు కేసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నా.. తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవడం ద్వారా మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడొచ్చనేలా ఈ గణాంకాలు ధైర్యాన్నిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా దాదాపు 85 శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు అసలు ఉండడంలేదు. కొందరిలో స్వల్పంగానే ఉంటున్నాయి.

15 శాతంమందే ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. వారిలోనూ 5 శాతం మందికి ఐసీయూలో చేరాల్సిన క్లిష్ట పరిస్థితులు తలెత్తుతున్నాయి.

పెద్దగా లక్షణాలు లేనివారిలో అత్యధికులు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 8,000 మందికి పైగా ఐసొలేషన్‌లో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

వీరిలో 10 రోజుల వరకూ ఎటువంటి సమస్య లేకపోతే.. మరో 7 రోజులు పరిశీలనలో ఉంచి, కొవిడ్‌ నుంచి బయటపడినట్లుగా వైద్యశాఖ ప్రకటిస్తోంది.

ఆసుపత్రుల్లో చేరినవారిలోనూ అత్యధికులు కోలుకుని బయటపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో ఒక్క శాతమే మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీన్ని బట్టి అత్యవసర సేవల్లోకి (ఐసీయూ) వెళ్లినవారిలోనూ ఎక్కువమంది కోలుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఈనెల మొదటి వారంలో దాదాపు 2,000కు చేరువగా కేసులు నమోదు కాగా, గత కొద్దిరోజులుగా ఆ సంఖ్య తగ్గుతోంది. కోలుకునే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

నిర్లక్ష్యం అసలు వద్దు సుమా..

కొవిడ్‌ కొత్త జబ్బు కావడంతో.. చికిత్సపై వైద్యనిపుణుల్లో పూర్తి స్పష్టత లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధుల్లో దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంచనా ఉన్నా.. కొన్నిసార్లు యుక్తవయస్కులు కూడా ఉన్నట్టుండి కొవిడ్‌ కారణంగా మృత్యువాతపడుతున్నారు.

అందుకే ‘అత్యధికులు కోలుకుంటున్నారు కదా..’ అనే నిర్లక్ష్యం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాల శాతం తక్కువే అయినా.. ఆ ఒక్కశాతంలో ఎవరు చిక్కుకుంటారనేది చెప్పలేని విషయం.

తొలి ఐదు రోజులు ఆరోగ్యంగా ఉన్న కొందరిలో ఉన్నట్టుండి పరిస్థితి విషమించిన సంఘటనలూ ఉన్నాయి. ఒకసారి ఐసీయూలో చికిత్స పొంది, కోలుకొని బయటకొచ్చినా.. కొందరిలో మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై అత్యవసర చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అందుకే సాధ్యమైనంత వరకూ వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి లక్షణాలు లేకుండా, లేదా స్వల్ప లక్షణాలతో ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నా.. ఆ క్రమంలో ఏ మాత్రం లక్షణాలు తీవ్రమైనా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలనీ, ముఖ్యంగా ఆయాసంగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని చెబుతున్నారు.

ఫలితం తేల్చకపోతే ఎలా?

గత నెలరోజులుగా ప్రభుత్వం పెద్దఎత్తున యాంటీజెన్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. గత మూడు వారాల్లోనే దాదాపు 1.5 లక్షల పరీక్షలు నిర్వహించింది. వీటితో పాజిటివా? నెగిటివా? అనేది 30 నిమిషాల్లోపే వెల్లడవుతున్నా.. ఆరోగ్యశాఖ దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని అందించడంలో మాత్రం జాప్యం చేస్తోంది.

కొందరికైతే 15 రోజులు గడిచినా అందడంలేదు. ఇళ్లలో చికిత్స పొందుతున్నవారిలో కొందరికి ఉన్నట్టుండి ఆయాసం రావడం, జ్వరం తీవ్రమైన సందర్భాల్లో.. ఉన్నపళంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.

కానీ పాజిటివ్‌ నిర్ధారణ లేకపోతే ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. ఇది బాధితులకు తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. పగటిపూట అయితే ఎలాగో తిప్పలు పడొచ్చు. కానీ ఏ రాత్రిపూటో పరిస్థితి విషమిస్తే అత్యవసర చికిత్స పొందడం దుర్లభమవుతోంది.

అందుకే ఫలితం తేలిన వెంటనే సమాచారం అందించాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు.

రాష్ట్రంలో కరోనాను జయించినవారు 76 శాతం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.