ETV Bharat / state

నేడు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​ పొడిగింపుపై క్లారిటీ?

author img

By

Published : Jun 8, 2021, 3:58 AM IST

కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్​డౌన్ విషయమై తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మూడో వేవ్ సన్నద్దతపైనా దృష్టి సారించనుంది. వానాకాలం పంటలు, సాగునీటి ప్రాజెక్టుల సంబంధిత అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ చర్చించనుంది.

నేడు కేబినెట్​ భేటీ..
నేడు కేబినెట్​ భేటీ..

రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో కేసులు తగ్గుతున్న పరిస్థితుల్లో.. ఇంకా ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేకించి తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై సమీక్షిస్తారు.
మూడో వేవ్ వస్తుందన్న వార్తలతో సమర్థంగా ఎదుర్కునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, ఏర్పాట్ల విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ రేపటితో పూర్తి కానుంది. దీంతో తదుపరి కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. కేసుల తీవ్రత తగ్గుతున్న పరిస్థితుల్లో మినహాయింపుల గడువును సాయంత్రం వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి హాజరుకు అనుమతించడంతో పాటు మరికొన్ని రంగాలకు కూడా మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

రైతుబంధుపై..

జిల్లాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను రేపు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందరు మంత్రులు ఏకకాలంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయానికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయమై మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం పంటల సాగు విషయమై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. రైతుబంధు సాయాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆ విషయమై కూడా సమావేశంలో చర్చించనున్నారు. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కల్తీ విత్తనాల నిరోధం కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత విత్తన విధానం, బయో ఫెర్టిలైజర్స్ పై నియంత్రణ కోసం చట్ట సవరణలు చేయాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వాటిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, వానాకాలంలో సాగునీరు, చెరువులు, కుంటలు నింపడం తదితర అంశాలపై చర్చించనున్నారు.

విద్యా సంబంధిత అంశాలు..

ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు సహా విద్యా సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కరోనా రెండోవేవ్, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. రాష్ట్ర ఆర్టికరంగంపై కొవిడ్, లాక్‌డౌన్ ప్రభావాన్ని సమీక్షిస్తారు. దీంతో పాటు ఆదాయ వనరుల సమీకరణపై కూడా చర్చించనున్నారు. ప్రభుత్వం, గృహ నిర్మాణ సంస్థ భూముల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అధికారులు కొంత కసరత్తు చేశారు. ఆ విషయమై కూడా చర్చ జరగనుంది. వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి పైలట్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు.

ఇదీ చూడండి: ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.