ETV Bharat / state

Telangana Minority 1 Lakh Scheme : మైనార్టీలకు గుడ్​న్యూస్​.. ఈ నెల 16 నుంచి రూ.1 లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ

author img

By

Published : Aug 8, 2023, 6:36 PM IST

Telangana Minority 1 Lakh Scheme : రాష్ట్రంలోని మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ఈ నెల 16 నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 10 వేల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్​రావు ప్రకటించారు.

Rs 1 Lakh Minorities Telangana Govt Scheme
Telangana Minority Rs 1 Lakh Scheme

Telangana Minority 1 Lakh Scheme : మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. మొదటి విడతలో పది వేల మంది లబ్ధిదారులకు చెక్కులు అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు నేడు పలువురు మంత్రులు సచివాలయంలో సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. శ్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజామ్​ల సంఖ్య పెంపు వంటి హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. మైనార్టీల సంక్షేమంలో భాగంగా రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన పది వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16వ తేదీ నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించాలని తెలిపారు.

1 Lakh Financial Assistence to Minorities in Telangana : సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన రూ.270 కోట్లకు అదనంగా, మరో రూ.130 కోట్లు కేటాయించి.. మొత్తం రూ.400 కోట్లను కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థికశాఖను మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం ఆర్థికసాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని చెప్పారు. మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింతగా దృష్టి సారించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎస్​ శాంతి కుమారిని కోరారు. రాష్ట్రంలో శ్మశాన వాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన మొత్తం వినతులను క్రోడీకరించాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

పెండింగ్​లో ఉన్న పనులను త్వరితగతిన చేయాలి : ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, ఉపకార వేతనాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హరీశ్​రావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి పనులు త్వరగా పూర్తయ్యేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను కోరారు. షాదీ ముబారక్‌ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే సొమ్ము అందేలా చూడాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

1 Lakh Financial Assistance to Minorities : ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, ఉపసభాపతి పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.