ETV Bharat / state

Fish Sector Production: మత్స్యరంగం బలోపేతంపై సర్కారు దృష్టి

author img

By

Published : Mar 18, 2022, 5:21 AM IST

Fish Sector Production: రాష్ట్రం ఏర్పడ్డాక అనేక పథకాలతో మత్స్య సంపదను పెంచిన ప్రభుత్వం.. ఆ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించింది. ఉచిత చేపల పిల్లలు, వలలు, ద్విచక్ర వాహనాలు, సంచార మార్కెట్లు సరఫరా చేస్తున్న క్రమంలో పెరుగుతున్న మత్స్య సంపద దృష్ట్యా... సవాళ్లు, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Fish
Fish

Fish Sector Production: స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యసంపద గణనీయంగాపెరిగింది. జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి 3.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ రంగాన్ని మరింత బలోపేతంపై దృష్టిసారించిన సర్కారు... హైదరాబాద్‌లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఐకాస నేతలతో సమావేశం నిర్వహించింది. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులపై న్యాయపరమైన ఇబ్బందులు, మత్స్యకారుల మధ్య సమన్వయంపై చర్చించారు. నీటి వనరుల సద్వినియోగంపై సమాలోచనలు చేశారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల బలోపేతంతో పాటు మత్స్యరంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారని ఐకాస నాయకులు తెలిపారు.

మత్య్సశాఖకు బదిలీ...

పంచాయతీ పరిధిలో ఉన్న 100 ఎకరాల లోపు ఆయకట్టు చెరువులను ప్రభుత్వం మత్స్యశాఖకు బదిలీ చేసింది. లీజు నిబంధనలు నిర్దేశించింది. నీటివనరుల్లో 1 హెక్టారుకు 1,333 నుంచి 2,132, సొసైటీలో పరిధిలో లేని చెరువుల్లో హెక్టారుకు 1,943 నుంచి 3,108గా ప్రతిపాదించింది. 6 నుంచి 9 మాసాలపాటు నీరు నిల్వ ఉంటే స్వల్పకాలిక నీటి వనరుల్లో... సొసైటీ పరిధిలో నీటి వనరులకు హెక్టారుకు 596 నుంచి 953, సొసైటీ పరిధిలో లేని చెరువుకు హెక్టారుకు 870 నుంచి 1392 రూపాయలు ప్రతిపాదించింది. ఆ లీజుధరలు పున: పరిశీలించాలని కోరగా.... మంత్రి సానుకూలంగా స్పందించారని మత్స్యసంఘాల నాయకులు తెలిపారు.

10 రోజుల్లో నివేదిక...

కొత్త సంఘాల ఏర్పాటుకు గ్రామ పంచాయతీ తీర్మానం తొలగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. నైపుణ్యపరీక్ష లేకుండా ఈత వస్తే సభ్యత్వం ఇవ్వాలని సమావేశంలో ప్రస్తావించారు. బోట్ నడపడం సహా ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. సొసైటీల విభజన, చెరువుల ఆక్రమణ సహా ఇతర సమస్యలన్నింటిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని మత్స్య శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.